జగన్ సైన్యం: ` న్యాయం ` కోసం.. నలుగురు సలహాదారులు.. !
ఏపీ వైసీపీ సర్కారు 42 మంది సలహాదారులను నియమించుకున్న విషయంతెలిసిందే. వీరిలో న్యాయ సలహాల కోసం ఏకంగా.. నలుగురు సలహాదారులను నియమించుకోవడం గమనార్హం. వీరు.. హైకోర్టు, సు ప్రీంకోర్టుల్లో ఎదురయ్యే న్యాయపరమైన చిక్కుల విషయంలో ప్రభుత్వానికి సలహాదారులుగా పనిచేశారు. న్యాయ పరంగా వీరికి మంచి పట్టు ఉంది. ఇక వీరు ఇచ్చిన సలహాలతోనే ప్రభుత్వం.. అనేక కేసుల్లో విచారణకు హాజరైంది. వీరిలో నలుగురు కూడా.. న్యాయ శాఖతో సంబంధాలు ఉన్నవారే కావడం గమనార్హం.
ప్రభుత్వం నియమించిన న్యాయ సలహాదారుల్లో పి.వి.రమణరాయలు ఒకరు. ఈయన డీజీపీ చీఫ్ లీగల్ సేవలు చూసేవారు. అంటే.. న్యాయపరమైన చిక్కులు వచ్చినప్పుడు నేరుగా డీజీపీని సమన్వయం చేసుకుని ఆయా సమస్యలపై చర్చించేవారు. ఇలా.. పలు కేసుల్లో ఈయన ఇచ్చిన సలహలు ఉపకరించాయి. ముఖ్యంగా గత ఏడాది జీవో 1 విషయంలో ప్రభుత్వానికి మంచి సలహాలే ఇచ్చారు. కానీ, హైకోర్టు వీటిని తోసిపుచ్చింది.
ఇక, మరో సలహదారు.. ఎం. నాగరఘు ఈయన కూడా డీజీపీ చీఫ్ లీగల్ సేవలుచూసేవారు. ఈయన రమణ రాయలుకు సహాయకారిగా ఉండేవారు. సుప్రీంకోర్టు వరకు కూడా.. సేవలు అందించేవారు. అయితే.. వీరు నేరుగా ముందుకు వెళ్లేవారు కాదు. సమస్య వచ్చినప్పుడు వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించేవారు. తగు రీతిలో సలహా ఇచ్చేవారు. ఇక, ఎం.ఆర్. శరవణ కుమార్, సీఐడీ చీఫ్ కు లీగల్ సేవలు అందించారు. ఈయన ఇచ్చిన సలహా లు కూడా ప్రభుత్వానికి చాలా సందర్భాల్లో బాగా ఉపయోగపడ్డాయి.
సీఐడీ కీలకమైన విభాగం అన్న విషయం తెలిసిందే. ఈ విభాగం గత రెండేళ్ల కాలంలో యాక్టివ్గా పనిచేసింది. చంద్రబాబు వంటి వారిని కూడా అరెస్టు చేసింది. ఇలాంటి అంశాల్లో శరవణకుమార్ ముఖ్య భూమిక పోషించారు. ఎలాంటి సలహాలు ఇవ్వాలి.. అనే విషయంలో ఆయన చురుగ్గా వ్యవహరించారు. అదేవిధంగా ఇనకొల్లు వెంకటేశ్వర్లు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చీఫ్ కు లీగల్ సేవలు అందించారు. ఇలా.. మొత్తంగా నలుగురు అధికారులు.. న్యాయ విభాగంలో సేవలు అందించడం గమనార్హం.