జగన్ బలగం: జగన్ వైద్యానికి కృష్ణబాబు చికిత్స.. నిజం..!
- కృష్ణబాబు ఎంట్రీతో మారిన ఆసుపత్రుల పనితీరు
- మధ్య తరగతిని ప్రభుత్వాసుపత్రుల వైపు నడిపించిన జగన్ సర్కార్
( విజయవాడ - ఇండియా హెరాల్డ్ )
గడిచిన ఐదేళ్ల జగన్ పాలనలో ఎవరూ వేలు పెట్టి చూపించని శాఖ ఏదైనా ఉంటే.. అది వైద్య, ఆరోగ్య శాఖ. సీఎం జగన్ ఈ శాఖ ద్వారానే ఎన్నికల్లో మేలు పొందే అవకాశం మెండుగా ఉందనే చర్చ కూడా సాగింది. పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేయడంలోనూ.. వైద్యులను సక్రమమైన బాటలో నడిపించడంలోనూ.. సర్కారు సక్సెస్ అయింది. అయితే.. దీనివెనుక.. అన్నీ తానై వ్యవహరించిన. అధికారి.. సీనియర్ ఐఏఎస్.. ఎంటీ కృష్ణబాబు.
సీఎంగా జగన్ వచ్చే వరకు కూడా.. విశాఖ పోర్టు ట్రస్టు సీఈవో కృష్ణబాబు వ్యవహరించారు. అయితే.. ఆయన పనితీరు తెలుసుకున్న జగన్ నేరుగా.. ఆయనను వైద్య శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా చేశారు ఇది.. చాలా వరకు కలిసి వచ్చింది. కృష్ణ బాబు ఎంట్రీకి ముందు.. ఆసుపత్రుల పనితీరు.. తర్వాత.. పనితీరులో 100 శాతం తేడా కనిపించింది. సమయ పాలనకు పెద్ద పీట వేయడం.. రోగులను కించ పరచకుండా చూసుకునేలా వైద్యులకు తర్ఫీదు ఇవ్వడం వంటి కీలక సంస్కరణలకు ఆయన జీవం పోశారు.
అప్పటి వరకు సర్కారు దవాఖానా అంటే.. చీదరించుకునే పరిస్థితి నుంచి మధ్యతరగతి వారు కూడా.. ప్రభుత్వ ఆసుపత్రులవైపు చూసేలా చేశారు. ముఖ్యంగా కరోనా సమయంలో కృష్ణబాబు అందించిన సేవలు అనుపమానమనే చెప్పాలి. ఎక్కడా సర్కారుకు చిన్న మాట రాకుండా చూసుకున్నారు. ఇంటింటికీ మాస్కులు పంపించారు. వలంటీర్ వ్యవస్థను కూడా సద్వినియోగం చేసుకున్నారు. మంత్రులతో సత్సంబంధాలను కొనసాగించారు. ఉన్నస్థాయి అధికారులను సమన్వయంచేసుకున్నారు.
ఎలా చూసుకున్నా.. వైద్య ఆరోగ్య రంగాన్ని పటిష్టంగా ముందుకు తీసుకువెళ్లారు. అంతకుముందు.. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో ఓపీ సేవలు ఉదయం 10 గంటలకే పరిమితమయ్యేవి. కానీ, కృష్ణబాబు.. మాత్రం ఓపీ సేవలను మధ్యాహ్నం 3గంటల వరకు కొనసాగించారు. అన్ని రకాల మందులను ఆసుపత్రుల్లో అందుబాటులోఉంచేలా చర్యలు తీసుకున్నారు. సీఎం జగన్ కలల పథకమైన ఆరోగ్యశ్రీని కూడా బలంగా అమలు చేయించడంలో కృష్ణ బాబు శ్రమించారు.