
ప్రకాశం జిల్లాలో టీడీపీ - వైసీపీ అంచనాలు ఇవే...?
- వైసీపీ అంచనాల్లో 7 సీట్లు గెలుస్తామని లెక్కలు
- టీడీపీ నుంచి అధికార వైసీపీకి ముచ్చెమటలు పట్టాయ్
( ప్రకాశం - ఇండియా హెరాల్డ్ )
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలుపు ఓటములపై అధికార వైసీపీ ప్రతిపక్ష కూటమి నేతలలో ఎవరి ? అంచనాలలో వారు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఒంగోలు పార్లమెంటు సీటుతో పాటు.. 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఒంగోలు నియోజక వర్గంలో ఎన్నికల తర్వాత వాతావరణం టీడీపీకి అనుకూలంగా మారినట్టు ప్రచారం జరుగుతుంది. బీసీ, కమ్మ, వ్యాపార, ఉద్యోగ, వైశ్య, బ్రాహ్మణ వర్గాల ఓటర్లు ఈసారి టీడీపీ వైపు ఉన్నట్టు అక్కడ లెక్కలు చెబుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ అంచనాల ప్రకారం ఒంగోలు, చీరాల, సంతనూతలంపాడు, అద్దంకి, పరుచూరు, కొండపి, కందుకూరు, కనిగిరి నియోజకవర్గాలలో తాము విజయం సాధించబోతున్నామని.. దర్శి మార్కాపురంలో కూడా గట్టి పోటీ ఇచ్చామని.. ఈ రెండు సీట్లు కూడా గెలుచుకుంటామని లెక్కలు వేసుకుంటున్నారు. టీడీపీ అంచనాల ప్రకారం గట్టి పోటీ మధ్యలో ఒంగోలు పార్లమెంటు స్థానంలో కూడా పసుపు జెండా రెపరెపలాడపోతున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్గా ఎనిమిది స్థానాలలో కచ్చితంగా గెలుస్తామని.. మరో రెండు చోట్ల గట్టి పోటీ ఇచ్చామని గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలలో మాత్రమే గెలుపు పై సందేహాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.
ఇక వైసీపీ లెక్కల ప్రకారం పార్లమెంటు స్థానంలో ఎంత గట్టి పోటీ ఉన్న స్వల్ప మెజార్టీతో అయినా తామే గెలుస్తామన్న ధీమా కనిపిస్తోంది. అసెంబ్లీల విషయానికి వస్తే పరుచూరు, అద్దంకి, సంతనూతలపాడు ఈ మూడు నియోజకవర్గాలలో మాత్రమే వైసీపీకి ఆశలు లేవు. మిగిలిన 9 నియోజకవర్గాలలో ఒకటి రెండు చోట్ల అటు.. ఇటు.. అయినా 8 నుంచి 9 సీట్లు తాము కచ్చితంగా గెలుస్తామని లెక్కలు వేసుకుంటుంది. పశ్చిమ ప్రకాశంలో ఎర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం, గిద్దలూరు నాలుగు సీట్లు తమవే అని వైసీపీ చెపుతోంది. మరి అంతిమంగా ఉమ్మడి జిల్లాలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.