క్రాస్ ఓటింగ్కు బలవుతోన్న టీడీపీ కేశినేని... వైసీపీ కేశినేని విక్టరీ..?
- అంబటిని కాదని కన్నాకే ఓట్లేసిన వైసీపీ ఫ్యాన్స్
- విజయవాడలో నానిని టీడీపీ నుంచి సాఫ్ట్గా ఓట్ల బదిలీ..?
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
రాష్ట్రంలో ముగిసిన పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అనేక విశ్లేషణలు.. అనేక చర్చలు తెరమీదికి వచ్చి న విషయం తెలిసిందే. దీనిలో ప్రధానంగా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని చర్చ తెరమీదికి వచ్చింది. ప్రధానంగా అన్ని పార్టీలతోనూ టచ్లో ఉన్న నాయకులు, వారి బంధువుల కారణం గా ఇది జరిగిందని భావిస్తున్నారు. ఉదాహరణకు.. రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
ఈమెకు ఇక్కడ పరిచయం తక్కువే అయినా.. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు మాత్రం పరిచ యం ఎక్కువ. దీంతో ఆయన నెల రోజుల ముందుగానే రాజమండ్రిలో తిష్ఠవేసి.. తన వారిని కలుస్తూ.. సైలెంట్ ఓటును తన సతీమణికి అనుకూలంగామార్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరిలో వైసీపీ వారు కూడా ఉన్నారనేది ఆసక్తికర విషయం. అదేవిధంగా తటస్థ ఓటర్లను మరింత ఎక్కువగానే దగ్గుబాటి ప్రభావం చేశారని అంటున్నారు.
ఇక, విజయవాడ పార్లమెంటు పరిదిలోనూ ఇలాంటివాతావరణమే కనిపిస్తోందని పరిశీలకులు చెబుతు న్నారు. ఇక్కడ నిన్న మొన్నటి వరకు కూడా టీడీపీలో ఉండి వైసీపీలోకి జంప్ అయ్యారు ఎంపీ కేశినేని నాని. అది కూడా ఎన్నికలకు కొద్ది రోజుల ముందే కావడం గమనార్హం. ఇక, ఆయన 2014 నుంచి టీడీపీలో ఉండడంతో ఆయన ద్వారా.. పార్లమెంటు పరిధిలో అనేక మంది లబ్ధి పొందారనే వాదన ఉంది. ఎన్నికల వేళ.. వీరంతా కూడా.. టీడీపీకి కాకుండా.. వైసీపీకి క్రాస్ ఓటింగ్ చేశారనే లెక్కలు వస్తున్నాయి. అంటే రుణం తీర్చుకున్నారనే అంచనాలు వస్తున్నాయి.
అలానే.. సత్తెనపల్లి నియోజకవర్గంలో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ తరఫున పోటీ చేశారు. ఈయనకు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలకు మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం వారంతా వైసీపీలో ఉన్నా .. కన్నా వారిని తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో ఇక్కడ కూడా క్రాస్ ఓటింగ్ జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. అదేవిధంగా నగరిలోనూ రోజాకు క్రాస్ ఓటింగ్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. కేజే కుమార్ సొంత పార్టీలోనే ఉంటూ.. ఆమెకు వ్యతిరేకంగా చేసిన ప్రచారం కారణంగా.. రోజాకు క్రాస్ ఓటింగ్ జరిగిందని అంటున్నారు. ఇలా.. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.