ఆర్ నారాయణ మూర్తి పేరు తెలియని తెలుగు వారు ఉండరు. సామాజిక సమస్యలపై ఆయన తీసే సినిమాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. కమర్షియల్ సినిమాలకు, వాటి నుంచి వచ్చే డబ్బుకు ఆయన దూరంగా ఉంటారు. ఇప్పటికే ఆయనకు పలు పెద్ద సినిమాల్లో ఆఫర్లు వచ్చినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. ముఖ్యంగా ఆయన తన వ్యక్తిత్వంతో ఎందరో మనసులు గెలుచుకున్నారు. సినిమా స్టార్ అయినప్పటికీ ఆయన నిరాడంబరంగా ఉంటారు. అందుకే ఆయనను అంతా పీపుల్స్ స్టార్గా పిలుచుకుంటారు. ఇక ఆయన గతంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ను ఆకాశానికి ఎత్తేశారు. ఆయన సంక్షేమ పథకాలు అమోఘమని కీర్తించారు. సంక్షేమ రంగంతో పాటు సాగునీటి ప్రాజెక్టులపై ఆయన దృష్టి పెట్టారని, ఆయన పాలనలో ఏపీ సుభిక్షంగా ఉందని కితాబిచ్చారు. పేదలకు అండగా జగన్ ఉన్నారని ప్రశంసించారు. అలాంటి ఆర్ నారాయణ మూర్తికి సీఎం జగన్ షాకిచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఏపీ సీఎం వైఎస్ జగన్ను 2019 సెప్టెంబర్ 27న సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి కలిశారు. ఆయన స్వస్థలం ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. తమ ప్రాంతంలో సాగు నీటి సమస్య పరిష్కారం కోసం ఆయన సీఎంతో భేటీ అయ్యారు. ఆర్ నారాయణ మూర్తిని సీఎం జగన్ వద్దకు మంత్రి దాడిశెట్టి రాజా తీసుకెళ్లారు. ఆ సమయంలో తాండవ జలాశయంలో ఎక్కువ నీటిని సమకూర్చేందుకు విశాఖ జిల్లాలోని గొలుగొండ పేట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలని ఆయన కోరారు. రిజర్వాయర్ లోకి పైపు లైను ద్వారా గోదావరి జలాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. అప్పటికప్పుడు ఈ సాగునీటి ప్రాజెక్టు కోసం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇది జరిగిన తర్వాత 2021లో రూ.470 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ను కూడా ఎంపిక చేశారు. అయితే ఏళ్లు గడుస్తున్నా ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. గతంలో సీఎం జగన్ను ఆర్ నారాయణ మూర్తి జగన్ను అపర భగీరథుడంటూ కీర్తించారు. ఈ ప్రాజెక్టు తన చిరకాల స్వప్నమని, దాని కోసం సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. అలాంటిది ప్రస్తుతం ప్రాజెక్టు అడుగు కూడా ముందుకు పడలేదని, ఆర్ నారాయణ మూర్తికి సీఎం జగన్ కోలుకోలేని షాక్ ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.