నాగర్ కర్నూల్ ప్రజలు బర్రెలక్కను నమ్ముతారా.. ఆ తప్పులే శిరీషకు శాపమా?

Reddy P Rajasekhar
తెలంగాణ రాజకీయాల్లో కొన్ని నెలల క్రితం బాగా పాపులర్ అయిన వ్యక్తులలో బర్రెలక్క శిరీష ఒకరు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శిరీషకు కేవలం 5,754 ఓట్లు మాత్రమే వచ్చాయి. యువత నుంచి మద్దతు దక్కినా ఆమె ఎన్నికల్లో మాత్రం విజయం సాధించలేదు. అయితే ఓటర్లకు డబ్బులు పంచకుండా శిరీష ఆ స్థాయిలో ఓట్లు సాధించడం కూడా గ్రేట్ అని కామెంట్లు వినిపించాయి.
 
ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన శిరీష ఆ మాటను నిలబెట్టుకున్నారు.  అదే ఆమెకు శాపమని తెలుస్తోంది.  నాగర్ కర్నూల్ లోక్ సభ డివిజన్ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క శిరీష నిన్న నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో బర్రెలక్క శిరీషకు ఊహించని స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చిన మీడియా ఇప్పుడు మాత్రం ఆమెకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది.
 
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె ప్రజా సమస్యలపై ఎలాంటి పోరాటాలు చేయలేదు. మరోవైపు నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ తరపున మాజీ ఎంపీ మల్లు రవి పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి పోతుగంటి భరత్ ప్రసాద్, బీ.ఆర్.ఎస్ నుంచి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బర్రెలక్క గెలిచే అవకాశాలు అయితే ఏ మాత్రం లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
బర్రెలక్క శిరీష ఒక్కో మెట్టు ఎదిగే దిశగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని నెటిజన్లు ఫీలవుతున్నారు. యువత ఆమెను నమ్ముతున్నా అన్ని వర్గాల ప్రజల మెప్పు పొందే విషయంలో ఆమె ఫెయిల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత బర్రెలక్క శిరీష ఏం చేస్తారో చూడాల్సి ఉంది. ప్రస్తుత రాజకీయాల్లో జీరో బడ్జెట్ పాలిటిక్స్ వర్కౌట్ కావని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బర్రెలక్క శిరీష ప్రజల్లో తనకు వచ్చిన మంచి గుర్తింపును సద్వినియోగం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: