ప్రమాదంలో ఈటెల రాజకీయ జీవితం.. ఇప్పుడు గెలుపు అత్యవసరం?
ఆయన ఎవరో కాదు ఈటల రాజేందర్. కెసిఆర్ తో పాటు బిఆర్ఎస్ స్థాపనలో భాగం అయిన ఈటల రాజేందర్ ఇక బిఆర్ఎస్ గెలుపు ఓటమిలో ఉన్నారు. అయితే ఆ తర్వాత కాలంలో గులాబీ దళపతి కేసీఆర్ తో విభేదాలు రావడంతో బిజెపిలో చేరారు. ఉప ఎన్నిక వచ్చిన తర్వాత విజయం సాధించారు. అయితే ఉప ఎన్నిక కలుపుకొని హుజురాబాద్ నియోజకవర్గంలో వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఈటల రాజేందర్. ఇలా ఒకప్పుడు తిరుగులేని నేతగా ఉన్న ఈటల రాజేందర్ పరిస్థితి ప్రస్తుతం మరోలా ఉంది. రాజకీయ జీవితానికి కాపాడుకోవడం కోసం ఎన్నో తంటాలు పడుతున్నారు.
ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి బిజెపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక ఈ ఎన్నికలు ఈటల రాజకీయ జీవితానికి డు ఆర్ డై లాంటిది అని ఎంతో మంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే గతంలో ఉప ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈటెల ఏ పార్టీలో ఉన్న డోకా లేదు అని అందరూ అనుకున్నారు. కానీ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. ఏకంగా గజ్వేల్ లో హుజురాబాద్ లో రెండు చోట్ల పోటీ చేశారు ఈటెల. రెండు చోట్ల ఓడిపోవడంతో షాక్ తగిలింది. ఇక ఇప్పుడు ఈటెల రాజకీయ జీవితం ప్రమాదంలో పడిపోయింది. దీంతో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఈటలకు ఎంతో అత్యవసరం. పార్టీలోనే ఈటెలపై కాస్త వ్యతిరేకత ఉన్నప్పటికీ వాటన్నింటినీ దాటి మల్కాజ్గిరి రేసులో నిలిచారు. అయితే ఇక్కడ విజయం సాధించడం అంత సులభమైన విషయం ఏమి కాదు. ఇది ప్రస్తుత ముఖ్యమంత్రి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం. ఇక సిట్టింగ్స్ స్థానాన్ని కాపాడుకోవడానికి రేవంత్ ఏం చేయడానికి అయినా సిద్ధంగానే ఉంటాడు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, బిఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మరి ఈటెల ఇక్కడ విజయం సాధిస్తారా లేదా చూడాలి.