బాలయ్య - లోకేష్ - బాబు = జగన్ ఈ ఇంట్రస్టింగ్ బెట్టింగ్ చూశారా..?
- రూపాయికి రూపాయిన్నర వేసి మరీ సవాల్ చేస్తోన్న వైసీపీ బెట్టింగ్ రాయుళ్లు..
- పై ముగ్గురిలో ఏ ఒక్కరూ జగన్కు దరిదాపుల్లోకే రారా..!
- పైగా కుప్పంలో బాబుకు గట్టి పోటీ..!
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో ఎన్నికల వేడి మామూలుగా లేదు. ఏపీ ఎన్నికలపై బెట్టింగ్లు మామూలుగా నడవడం లేదు. ఇదిలా ఉంటే ఓ విచిత్రమైన బెట్టింగ్ను వైసీపీ బెట్టింగ్ రాయుళ్లు తెరమీదకు తెస్తున్నారు. టీడీపీ నుంచి వీఐపీలుగా పోటీ చేస్తోన్న ముగ్గురు నేతలకు వచ్చే మెజార్టీల కంటే వైసీపీ అధినేత జగన్ మెజార్టీయే ఎక్కువుగా ఉంటుందన్నదే ఆ బెట్టింగ్. టీడీపీ నుంచి చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తుంటే.. గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ ఈ సారి మళ్లీ అక్కడ నుంచే పోటీ చేస్తున్నారు.
ఇక బాలయ్య హిందూపురంలో వరుసగా మూడోసారి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో జగన్కు పులివెందులలో ఏకంగా 90 వేల పై చిలుకు మెజార్టీ వచ్చింది. హిందూపురంలో బాలయ్యకు 17 వేల మెజార్టీ వస్తే.. కుప్పంలో చంద్రబాబు 30 వేల మెజార్టీతో విజయం సాధించారు. ఇక లోకేష్ మంగళగిరిలో 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ సారి బెట్టింగుల్లో లోకేష్, చంద్రబాబు, బాలయ్య ఈ ముగ్గురిలో ఏ ఇద్దరిని కోరుకున్నా వారికి వచ్చే మెజార్టీ కంటే పులివెందులలో జగన్కే ఎక్కువ మెజార్టీ వస్తుందనేదే ఈ బెట్టింగ్.
బాలయ్య ఈ సారి మెజార్టీ పెరిగితే 25 వేల వరకు ఉండొచ్చు.. లోకేష్కు 5- 10 వేల మధ్యలో అటూ ఇటూగా ఉంటుందని వైసీపీ బెట్టింగ్ రాయుళ్ల అంచనా. ఇక కుప్పంలో చంద్రబాబుకు 40 వేల కు కాస్త అటూ ఇటూగా ఉంటుందని అంటున్నారు. వీరిలో ఏ ఇద్దరి మెజార్టీ కలిపినా 65 వేలు దాటేలా లేదు. అందుకే పై ముగ్గురిలో ఎవరైనా ఇద్దరిని తీసుకోండి.. కావాలంటే పవన్ను కూడా కలుపుకుని నలుగురిలో ఏ ఇద్దరి మెజార్టీలు కలిపినా పులివెందులలో జగన్ మెజార్టీని క్రాస్ చేయవు అంటూ బెట్టింగులు వేస్తోన్న పరిస్థితి.