ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం చాలా ఆసక్తికరంగా మారింది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎన్నికల బరిలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్, టిడిపి పార్టీ నుంచి కొలికపూడి శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి మధ్య పోటీ తీవ్రంగా నడుస్తోంది. ప్రచారంలో భాగంగా ఒకరిపై ఒకరు దారుణంగా విమర్శలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ విధంగా వారి ప్రచారం మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగుతున్న తరుణంలో టిడిపి అభ్యర్థి శ్రీనివాస్ కు కొత్త తలనొప్పి ఏర్పడింది. అక్కడ అభ్యర్థిని మారుస్తున్నారంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఆయన ప్రచారం డిస్టర్బ్ అవుతున్నట్టు తెలుస్తోంది. మరి ఇంతకీ ఆయనను టిడిపి నుంచి డిస్టర్బ్ చేస్తున్నది ఎవరు.. ఆ వ్యవహారం ఏంటో చూద్దాం.
మొన్నటి వరకు తిరువూరులో బలమైన నేతలుగా టిడిపి నుంచి కేశినేని నాని, కేశినేని చిన్ని ఉండేవారు. ఎప్పుడైతే చంద్రబాబు అక్కడ సభ పెట్టారో ఆ సమయంలో కేశినేని చిన్ని అన్ని తానై చంద్రబాబును ముందుండి నడిపించారు. దీంతో నచ్చని కేశినేని నాని టిడిపి పై తిరుగుబాటు జెండా ఎగరవేయడంతో ఆయనకు సీటు ఇవ్వలేనని చంద్రబాబు తెగేసి చెప్పారు. దీంతో తిరువూరు టిడిపిలో ముసలం పుట్టింది. దీంతో నాని వైసీపీలో చేరారు. ఇదే తరుణంలో తిరువూరు అసెంబ్లీ సీటును శ్రీనివాస్ కు కేటాయించారు. ఆయన ప్రచారంలో దూసుకుపోతున్న తరుణంలో మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తిరువూరు సీటు తనకు కేటాయించాలని తిరుగుబాటు చేస్తోంది. తాజాగా ఆమె కేశి నేని చిన్నితో సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంది.
ఈ సందర్భంగా తనకు టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపించారని , ఈ టికెట్ నాకే కేటాయించాలని తెగేసి చెప్పిందట. దీంతో నియోజకవర్గ టిడిపిలో ఓ వైపు శ్రీదేవి వర్గం, మరోవైపు కొలికపూడి శ్రీనివాస్ వర్గం అంటూ రెండు వర్గాలు ఏర్పడి టిడిపి పట్టును విడగొడుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలిచినా కొన్ని ఓట్ల తేడాతోనే గెలుస్తారు. పోటీ అనేది హోరాహోరీగా ఉంటుంది. ఈ తరుణంలో కలిసి పని చేసుకోవాల్సిన టైంలో వర్గాలుగా విడిపోవడం వల్ల ఓట్లు చీలికయ్యే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టిడిపిలో ఈ తంతు ఇలాగే కొనసాగితే అక్కడ వైసీపీకి విజయ అవకాశాలు పెరుగుతాయని తెలియజేస్తున్నారు. మరి చూడాలి దీనిపై టిడిపి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ముందు ముందు తెలుస్తుంది.