ఏపీ: జగన్ కి పక్కలో బల్లెంలాగా మారిన సొంత చెల్లెల్లు?

Suma Kallamadi
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రోజురోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. ఒకపక్క కూటమి వైసిపి ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటే మరోపక్క జగన్ సొంత చెల్లెల్లు సైతం వైసీపీ ప్రభుత్వంపైన అదేస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అవును, తన సొంత చెల్లి షర్మిల, చిన్నాన్న కూతురు సునీత ఇద్దరు కూడా జగన్ ను టార్గెట్ చేసుకుని "న్యాయ యాత్ర" అనే పేరుతో రోడ్డు షోలు నిర్వహిస్తూ, బహిరంగ సభల్లో బాహాటంగానే జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దాంతో షర్మిల తన సొంత అన్నపై చేస్తున్న విమర్శలు ఇపుడు వైస్ అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి అనడంలో సందేహమే లేదు. అవే విమర్శలు జనాలను ఆలోచింపజేసేవిలా ఉంటున్నాయి కూడా.
ఈ నేపథ్యంలోనే ఎంతోమంది వైస్సార్సీపీ కార్యకర్తలు నాయకులు అటు టీడీపీలోను, ఇటు కాంగ్రెస్ లోను కలవడం మనం చూస్తూ వున్నాం. కొంతమంది ప్రజలు అయితే 'సొంత చెల్లెళ్లకే న్యాయం చేయలేనివారు సొంత రాష్ట్రానికి ఇంకేం చేస్తాడు?' అని పెదవి విరుస్తున్నారు. నిన్నటి నుంచి కడప జిల్లాలో సునీత, షర్మిలలు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను తమ ప్రచారంలో ప్రధాన అస్త్రంగా మార్చుకున్నట్టు కొట్టొచ్చినట్టు కనబడుతోంది. వైయస్ వివేకాను హత్య చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు అంటూ జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలకు వైసీపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నప్పటికీ అది సరిపోవడం లేదు. నిప్పులేనిదే పొగ రాదుకదా అన్నట్టు జనాలు గుసగుసలాడుకుంటున్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఐదేళ్లు దాటుతున్నా తన అన్న అసలు నిందితులను పట్టుకోవడానికి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నట్టు జగన్ ప్రభుత్వాన్ని షర్మిల సునీతలు ప్రశ్నిస్తున్నారు. తమ అన్న అధికారంలో ఉన్నప్పటికీ న్యాయం చేయలేకపోతున్నారని, నిందితుల పక్షాన నిలబడి తమకు అన్యాయం చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. దాంతో ఈ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వారు ప్రజలను అడుగుతున్నారు. కడప ఎంపీగా మరోసారి పోటీ చేయబోతున్న అవినాష్ రెడ్డిని ఓడించి వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలంటూ వారు ప్రజలను అభ్యర్థిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: