అమరావతి : షర్మిలకు పొద్దు తెలీటంలేదా ?
కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్న సామెత తెలుగులో చాలా పాపులర్. దీనికి వివరణ అవసరం లేదు కాని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహారం అలాగే ఉంది. కాంగ్రెస్ లో బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ప్రతిరోజు విభజన హామీలు, ప్రత్యేకహోదా, వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ అంటు నానా గోలచేస్తున్నారు. గడచిన పదేళ్ళల్లో షర్మిల ఎప్పుడూ ఈ డిమాండ్లను కాని ప్రస్తావన కాని చేసిన గుర్తులేదు. అలాంటిది హస్తంపార్టీకి అధ్యక్షురాలు కాగానే ఆమెకు అర్జంటుగా విభజన హామీలన్నీ గుర్తుకొచ్చేశాయి.
ఒకవైపు విభజన హామీలను నెరవేర్చలేదని నరేంద్రమోడిని నానా మాటలంటున్నారు. ఇదే సమయంలో చంద్రబాబునాయుడును కొంచెంగా, జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగాను విరుచుకుపడిపోతున్నారు. తాజాగా జగన్, చంద్రబాబుకు కలిపి ఒక లేఖ రాశారు. అందులో ఏముందంటే రాష్ట్రప్రయోజనాల కోసం ఉమ్మడి పోరాటాలు చేయటానికి జగన్, చంద్రబాబు సిద్ధంగా ఉండాలని సూచించారు. 5.5 కోట్లమంది జనాల హక్కులను కాలరాస్తుంటే, నిర్లక్ష్యంచేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని బెదిరించటమే విచిత్రంగా ఉంది.
విభజన హామీల సాధనకోసం కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పోరాడాలని జగన్, చంద్రబాబుకు షర్మిల గుర్తుచేయటమే కామెడీగా ఉంది. షర్మిల చెప్పనిది ఏమిటంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే పోరాటాలకు జగన్, చంద్రబాబు కలిసి రావాలని ఆహ్వానించలేదంతే. విచిత్రం ఏమిటంటే రాష్ట్రవిభజనను అడ్డుగోలుగా చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఏకపక్షంగా చేసిన విభజన వల్లే ఏపీ పరిస్ధితి ఇంత దయనీయంగా తయారైంది. అడ్డుగోలు విభజన చేసి ఏపీని కోలుకోలేనంతగా దెబ్బకొట్టినందుకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
ఆ విషయాన్ని వదిలేసి ఉమ్మడిపోరాటాలు చేయాలని జగన్, చంద్రబాబుకు గుర్తుచేయటమే విచిత్రంగా ఉంది. పదేళ్ళుగా విభజన హామీలపై అన్నీపార్టీలు మాట్లాడి, మాట్లాడి అలసి నీరసమొచ్చి వదిలిపెట్టేశాయి. విభజన తర్వాత మూడో ఎన్నికకు రోజులు ముంచుకొచ్చేస్తున్నాయి. ఈ సమయంలో కొత్త బిచ్చగాడు లెక్క షర్మిల విభజన హామీలను తవ్వి తలకెత్తుకున్నారు. తన అవసరాల కోసం తాను తలకెత్తుకున్నారు కాబట్టి అందరు కూడా భుజనా మోయాల్సిందే అని, పోరాటాలు చేయాలని పిలుపివ్వటమే విడ్డూరంగా ఉంది.