అమరావతి : సొంత ఎంపీపైనే చంద్రబాబు స్కెచ్ వేశారా ?

Vijaya



విజయవాడ తెలుగుదేశంపార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎంపీ కేశినేని నానీకి పొగబెడుతున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చాలాకాలంగా చంద్రబాబునాయుడుతో ఎంపీకి పడటంలేదు. ఎంపీని కావాలనే చంద్రబాబు నిరాదరిస్తున్నారు. అందుకనే చంద్రబాబును ఎంపీ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తనతో పాటు పార్టీ నేతలను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా ఎంపీపైన చర్యలు తీసుకునే ధైర్యం చంద్రబాబు చేయటంలేదు. చంద్రబాబు బలహీనతే ఎంపీ రెచ్చిపోవటానికి కారణమవుతోంది.



పార్టీలో పరిస్ధితులపై ఎంపీ చేసిన కొన్ని వ్యాఖ్యలను గమనించిన తర్వాత నానీని పార్టీలో నుండి బయటకు పంపటానికే చంద్రబాబు స్కెచ్ వేశారని అర్ధమైపోతోంది. చంద్రబాబు స్టైల్ ఎలాగుంటుందంటే ఎవరినైనా పార్టీలో నుండి బయటకు పంపటానికి డిసైడ్ అయితే సదరు నేతను బాగా అవమానిస్తారు.  తనంతట  తానుగా సదరు నేత పార్టీని వదిలేసే పరిస్ధితిని తీసుకొస్తారు. అంతేకానీ డైరెక్టుగా నేతపైన యాక్షన్ తీసుకోరు. ఇపుడు ఎంపీ విషయంలో కూడా అదే జరుగుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.



రాజమండ్రిలో జరిగిన మహానాడులో పాల్గొనేందుకు ఎంపీకి ఆహ్వానంలేదట.  మహానాడులో పాల్గొనేందుకు సొంతపార్టీ ఎంపీకి ఆహ్వానం ఏమిటని తమ్ముళ్ళు కొందరు ఎదురుదాడి చేస్తున్నారు. కానీ తనను దూరంగా ఉంచేందుకే చంద్రబాబు ఆహ్వానం పంపలేదని ఎంపీ అంటున్నారు. పార్టీలోని కిందస్ధాయి కార్యకర్తకు కూడా మహానాడులో పాల్గొనాలని లేఖలు రాసిన చంద్రబాబు తనకు ఎందుకు ఆహ్వానం పంపలేదని ఎంపీ అడుగుతున్నారు. అలాగే ఈమధ్యనే విజయవాడలో జరిగిన పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవానికి కూడా ఆహ్వానించలేదట.



పార్టీ కార్యక్రమాలకు, సమావేశాలకు కూడా తనకు ఆహ్వానం అందటంలేదని ఎంపీ మండిపోతున్నారు. పైగా రాబోయే ఎన్నికల్లో తన తమ్ముడు శివధర్ కే ఎంపీ టికెట్ అంటు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిప్పటాన్ని కూడా ఎంపీ పాయింట్ చేస్తున్నారు. ఇదంతా చూసిన తర్వాత ఎంపీకి టికెట్ దక్కేది అనుమానంగానే ఉంది. ఇదంతా ఎందుకు జరుగుతోందంటే తనంతట తానుగా పార్టీలో నుండి బయటకు వెళిపోయేట్లు చంద్రబాబు పొగపెడుతున్నారని ఎంపీ అనుమానిస్తున్నారు. మరి ప్రయత్నాలు పొగతోనే ఆగిపోతుందా లేకపోతే మంటరాజుకుని పెద్దదవుతుందా అన్నది చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: