అమరావతి : జగన్ అదృష్టవంతుడే

Vijaya


జగన్మోహన్ రెడ్డి ప్రయాణించిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తటంతో వెంటనే గన్నవరం విమానాశ్రయంలో సేఫ్ ల్యాండింగ్ చేయించారు అనగానే వైఎస్సార్ ఘటన గుర్తుకొచ్చింది. సోమవారం సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో జగన్ గన్నవరం ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. అయితే అర్ధగంటలోనే విమానంలో సాంకేతికలోపాన్ని గుర్తించిన పైలెట్ వెంటనే విమానాన్ని తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టుకే తీసుకొచ్చి ల్యాండ్ చేశారు. దాంతో జగన్ సేఫ్ గా  తాడేపల్లికి చేరుకుని రాత్రికి మళ్ళీ మరో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళారు.



సీన్ కట్ చేస్తే 2009 సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్సార్ చిత్తూరులో జరగాల్సిన రచ్చబండ కార్యక్రమానికి హెలికాప్టర్లో బయలుదేరారు. కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. దాంతో విషయం తెలియగానే దేశమంతా టెన్షన్ పెరిగిపోయింది. చివరకు కర్నూలు జిల్లాలోని పావురాలగుట్ట దగ్గర హెలికాప్టర్ కూలిపోయిందనే వార్త అందరినీ కలచివేసింది. ఆ దుర్ఘటనలో వైఎస్సార్ తో సహా అందరు చనిపోయారు.



హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగానే ప్రమాదం జరిగిందని ఒక వెర్షన్. కాదుకాదు వాతావరణ ప్రభావం కారణంగానే ప్రమాదం జరిగిందని మరో వెర్షన్. అదేంకాదు గిట్టని వాళ్ళే పైలెట్ ను మ్యానేజ్ చేసి వైఎస్సార్ ను చంపించేశారే ప్రచారమూ విపరీతంగా జరిగింది. ఏమి జరిగిందో భగవుంతుడికి మాత్రమే తెలియాలి అయితే  ఇప్పటికీ వైఎస్సార్ మరణం మిస్టరీయే.



అప్పట్లో  వైఎస్సార్ రెగ్యులర్ గా ప్రయాణించే హెలికాప్టర్ కాకుండా వేరేది ఉపయోగించారట. కారణం ఏమిటంటే అది సర్వీసింగుకు పంపారని, రిపేర్లు చేయిస్తున్నారని రకరకాల కారణాలు బయటపడ్డాయి. ఇపుడు కూడా అలాంటి కారణమే చెబుతున్నారు. ఇపుడేమిటంటే జగన్ రెగ్యులర్ గా ప్రయాణించే విమానం కాదట ఇది. వేరే విమానాన్ని పంపారని అంటున్నారు. ఈ విషయాలను చూసుకోవాల్సింది విమానాన్ని పంపిన కంపెనీ, సీఎంవో+ప్రోటోకాల్ అధికారులు మాత్రమే.



విమానం మారిన విషయాన్ని మరి జగన్ కు చెప్పారో లేదో. అప్పట్లో హెలికాప్టర్ మారిన విషయాన్ని, హెలికాప్టర్లో సాంకేతికలోపాలను ముందుగా పైలెట్ చెక్ చేసుకోలేదని  తర్వాత బయటపడింది. ఇపుడు కూడా విమానం ప్రయాణించిన 20 నిముషాల తర్వాత సాంకేతికలోపం బయటపడింది. వెంటనే అలర్టయిన పైలెట్ తిరిగి గన్నవరంలో ల్యాండ్ చేసేశారు. అప్పట్లో వైఎస్సార్ బ్యాడ్ లక్ అయితే ఇపుడు జగన్ అదృష్టవంతుడు. జరిగిన ఘటనపై జగన్ సీరియస్ అయి ఉన్నతస్ధాయి విచారణకు ఆదేశించారు. మరి విచారణలో ఏమి బయటపడుతుందో  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: