పంజాబ్లో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటో...!
పంజాబ్ రాష్ట్రంలో అధికారంలోని కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు పార్టీలోని కొంత మంది నేతలకు మధ్య విబేధాలు తారాస్థాయిలో ఉన్నాయి. సిద్ధూతో విబేధించిన మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్... హస్తం పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కూడా. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి చన్నీకి సిద్ధూకు మధ్య కూడా ఇప్పుడిప్పుడే వాతావరణం చెడుతోంది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఆయనే అంటూ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది కూడా. అయితే.. దీనిని గండి కొట్టేలా కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇప్పట్లో ప్రకటించేది లేదని తేల్చేసింది. దీంతో సిద్ధూ వర్గానికి గట్టి షాక్ ఇచ్చినట్లుగా అయ్యింది. ఇటు అంతర్గత కలహాలతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ పార్టీ... ఈ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుందో చూడాలి మరి.