కేసీఆర్ సీటు ఇవ్వకపోతే కారు దిగి పోటీ చేస్తా... కీలక నేత సవాల్ ?
ఒకప్పుడు రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన జూపల్లి కెసిఆర్ తొలి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో రాజకీయంగా ఆయన వెనక పడిపోయారు. ఒకప్పటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు పార్టీలో ఎవరికీ పట్టని నేతగా మారిపోయారు. గత ఎన్నికల్లో జూపల్లి పై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరిపోయారు.
అప్పటినుంచి ఆయన తన సొంత నియోజకవర్గం కొల్లాపూర్ లో నే పట్టు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ కృష్ణారావు వర్గానికి టిక్కెట్లు రాకపోవడంతో ఆయన తన అనుచరులతో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున రంగంలోకి దిగి సత్తా చాటుకున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో హర్షవర్ధన్ రెడ్డి కి టిఆర్ఎస్ టిక్కెట్ వస్తే ... జూపల్లి తాను ఏ పార్టీ నుంచి పోటీ చేయాలన్న దానిపై కూడా తన అనుచరులతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆయన పార్టీ టిక్కెట్ ఇవ్వకపోయినా సత్తా చాటుతానని సవాళ్లు కూడా రవ్వుతున్నారట. టీఆర్ ఎస్ టిక్కెట్ దక్కని పక్షంలో టిఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది. బిజెపిలో తన చిరకాల రాజకీయ ప్రత్యర్ధి అయిన మాజీ మంత్రి డీకే అరుణ ఉండడంతో ఆయన కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది.