రామ్మోహన్ ప్రత్యర్ధిగా ఆయన్ని ఫిక్స్ చేస్తారా?

VUYYURU SUBHASH
అధికార వైసీపీకి ఎంత బలం ఉన్నా సరే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి ధీటుగా నిలబడే నాయకులు లేరు. చాలా చోట్ల వైసీపీకి సరైన అభ్యర్ధులు లేకపోవడం విడ్డూరంగానే ఉందని చెప్పాలి...కానీ అదే వాస్తవం...రాష్ట్రం మొత్తం వైసీపీకి బలం ఉంది..కానీ కొన్ని చోట్ల మాత్రం పార్టీకి నాయకులే లేరన్నట్లు పరిస్తితి ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంలో టీడీపీకి ధీటైన నేత వైసీపీలో కనిపించడం లేదు. ఎందుకంటే పార్లమెంట్ స్థానంలో ఉన్నది రామ్మోహన్ నాయుడు కాబట్టి.

గత రెండు పర్యాయాల నుంచి శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి రామ్మోహన్ టీడీపీ నుంచి ఎంపీగా గెలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే అభ్యర్ధులని మార్చిన సరే వైసీపీకి విజయం అందని ద్రాక్ష అన్నట్లే ఉంది. ఇక మూడోసారి రామ్మోహన్‌పై పోటీకి దింపే నాయకుడు ఇంకా లేకపోవడం కాస్త వైసీపీకి ఇబ్బందిగా మారిందనే చెప్పాలి. ప్రస్తుతానికి శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంలో వైసీపీని నడిపించే నాయకుడు లేరు.

వచ్చే ఎన్నికల్లో రామ్మోహన్‌పై ఏ నాయకుడు పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. అయితే గత రెండు ఎన్నికల్లో వేరు వేరు అభ్యర్ధులు రామ్మోహన్‌పై పోటీ చేసి ఓడిపోయారు. 2014లో రెడ్డి శాంతి, 2019లో దువ్వాడ శ్రీనివాస్‌లు పోటీ చేసి ఓడిపోయారు. అయితే వీరు మళ్ళీ రామ్మోహన్‌పై పోటీ చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే రెడ్డి శాంతి ఇప్పుడు పాతపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే దువ్వాడ...శ్రీకాకుళంలో ఓడిపోయాక టెక్కలి ఇంచార్జ్‌గా వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఎన్నికల్లో దువ్వాడ, టెక్కలి నుంచే పోటీ చేయనున్నారు.

అయితే గత ఎన్నికల్లో టెక్కలి నుంచి పోటీ చేసి ఓడిపోయిన పేరాడ తిలక్...ఈ సారి రామ్మోహన్‌పై పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎలాగో తిలక్‌కు టెక్కలి సీటు రాదు...కాబట్టి ఉన్న ఆప్షన్ శ్రీకాకుళం పార్లమెంట్. అదే సమయంలో కిల్లి కృపారాణి సైతం పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ ఇద్దరిలో రామ్మోహన్ ప్రత్యర్ధి ఎవరు అవుతారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: