ఆనందబాబుని ఏమన్నా హైలైట్ చేస్తున్నారుగా!
ఇప్పటికే పలువురు టిడిపి నాయకులని అలాగే హైలైట్ చేసింది. పోలీసుల చేత టిడిపి నేతలని అడ్డుకోవాలని చెప్పి, అనవసరంగా వారిపై జనాల్లో సానుభూతి పెరిగేలా చేస్తున్నారు. నారా లోకేష్ విషయంలో అదే చేసిన విషయం తెలిసిందే. ఏదో గుంటూరు జిల్లాలో రమ్యశ్రీ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన లోకేష్ని అనవసరంగా హైలైట్ చేసేశారు. పరామర్శించి ఆయన పని ఆయన చేసుకుని వెళ్లిపోయేవారు. కానీ పోలీసులు అక్కడకు వెళ్ళి లోకేష్ని అరెస్ట్ చేయడం వల్ల పరిస్తితి మారిపోయింది.
ఇలా లోకేష్నే కాదు...అనేక మంది టిడిపి నాయకులని వైసీపీ హైలైట్ చేసింది. ఇప్పుడు మాజీ మంత్రి నక్కా ఆనందబాబుని హైలైట్ చేసే పనిలో పడ్డారు. డ్రగ్స్, గంజాయి విషయంలో టిడిపి నేతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అసలు సిఎం జగనే డ్రగ్స్, గంజాయి వ్యాపారం చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అవే ఆరోపణలు నక్కా ఆనందబాబు కూడా చేశారు.
అయితే ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని పోలీసులు అర్ధరాత్రి ఆనందబాబు ఇంటికొచ్చి నోటీసులు ఇచ్చి హడావిడి చేశారని టిడిపి నేతలు ఫైర్ అవుతున్నారు. అలా చేయడం వల్ల వైసీపీకే డ్యామేజ్ జరిగేలా ఉంది. ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి చేయిస్తున్నారని టిడిపి ఆరోపిస్తుంది. అయినా అన్నీ విమర్శలకు ఆధారాలు ఇవ్వాలంటే పోలీసులు ఎందుకు ఉన్నారనే ప్రశ్నలు వస్తాయి. ఉదాహరణకు చంద్రబాబు అక్రమ మద్యం అమ్ముతున్నారని, గంజాయి అమ్ముతున్నారని మంత్రి నారాయస్వామి ఆరోపించారు. మరి మంత్రికి ఆధారాలు ఇవ్వాలని పోలీసులు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? అంటే ఇదంతా రాజకీయమని అర్ధమవుతుంది. అయినా అనవసరంగా ఆనందబాబుని కూడా హైలైట్ చేసేశారు.