బండి పాదయాత్రతో బీజేపీకి మైలేజ్ రాలేదా..?
బండి సంజయ్ కి మద్ధతుగా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఆరుగురు కేంద్ర మంత్రులు అలాగే పలువురు జాతీయ నాయకులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ తొలిదశ పాదయాత్ర ఆగస్టు 28న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమై సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ముగిసింది. పాదయాత్రలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలను వింటూనే.. కేసీఆర్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రం తెలంగాణకు ఇస్తున్న నిధుల వివరాలను ప్రజలకు తెలియజేస్తూ 34 సభల్లో మాట్లాడారు.
అయితే, బండి సంజయ్ పాదయాత్రకు బీజేపీలోని కొన్ని గ్రూపులు ఆయనకు సహకరించలేదని వినిపిస్తోంది. కిషన్ రెడ్డి వర్గం సంజయ్ పాదయాత్రలో పాలు పంచుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి చేపట్టిన సభలు, సమావేశాలతో కూడా బండి పాదయాత్రకు ఊపు తగ్గిందని అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ముందు బండి కి ప్రాధాన్యం దక్కలేదని అంటున్నారు. అలాగే రేవంత్ రెడ్డి వైట్ చాలెంజ్లో స్వయంగా మంత్రి రియాక్ట్ అయి కోర్టుకు వెళ్లి మరి రేవంత్ రెడ్డి నోరు మూయించారు. ఈ డ్రగ్స్ విషయంపై బండి సంజయ్ మాట్లాడడంలో విఫలం అయ్యాడని భావిస్తున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ఊపు ముందు బండి పాదయాత్రకు ఎలాంటి మైలేజ్ రాలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.