ప్రభుత్వ అధికారులకు సీజేఐ వార్నింగ్..!
ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ ఐపీఎస్ అధికారి దాఖలు చేసిన పిటిషన్పై నేడు సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. అక్రమాస్తుల కేసులో సస్పెండైన్ ఐపీఎస్ అధికారి గుర్ణీందర్ పాల్ సింగ్... తనను అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం... అవినీతికి పాల్పడిన అధికారులను తప్పకుండా జైలు పంపించాల్సిందే అని స్పష్టం చేసింది. గత ప్రభుత్వాలతో సన్నిహితంగా మెలిగి అక్రమార్జనకు పాల్పడిన అధికారులు... జైలు శిక్ష అనుభవించాల్సిందే అన్నారు. అలాగే ప్రభుత్వంతో కుమ్మక్కైన పోలీసు అధికారులకు ఎలాంటి రక్షణ కల్పించలేమన్నారు సీజేఐ ఎన్వీ రమణ. అవినీతికి పాల్పడిన అధికారులు ప్రతి కేసులో రక్షణ పొందలేరని.... ప్రభుత్వంలో సన్నిహితంగా ఉండి... అక్రమార్జనకు పాల్పడిన వారికి ఇదే విధంగా జరుగుతుందన్నారు. తప్పుడు పనులు చేసిన ప్రభుత్వ అధికారులు ఏదో ఒకరోజు తప్పనిసరిగా మూల్యం చెల్లించాల్సిందే అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. అసలు అవినీతితో అక్రమార్జనకు పాల్పడిన అధికారులకు రక్షణ ఎందుకు కల్పించాలంటూ ప్రశ్నించారు.