తాలిబన్ల ఆక్రమణలపై ఆఫ్ఘాన్ అధ్యక్షుడి రియాక్షన్..!

NAGARJUNA NAKKA
అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ జాతినుద్దేశించి ప్రసంగించారు. తాలిబన్లు దురాక్రమణ కొనసాగుతున్న కారణంగా దేశ భద్రతాదళాలను పునరుత్తేజం చేయడమే తన లక్ష్యమన్నారు. ఓ వీడియో ద్వారా సందేశం ఇచ్చిన ఘనీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అస్థిరతను ఆపేస్తామన్నారు. మరోవైపు తాలిబన్లు ఆప్ఘానిస్థాన్ లోని మెజార్టీ నగరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్ల దురాక్రమణ కొనసాగుతూనే ఉంది. రాజధాని కాబుల్ కు దక్షిణాన ఉన్న లోగర్ రాష్ట్రాన్ని తాలిబన్లు పూర్తిగా ఆక్రమించినట్టు అక్కడి అధికారుల తెలిపారు. ప్రస్తుతం తాలిబన్లు కాబుల్ కు 50కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు వివరించారు. కాబుల్ కు ఉత్తరాన ఉన్న మజార్ -ఏ-షరీఫ్ ప్రాంతంపై.. అన్ని వైపుల నుండి దాడి చేస్తున్నట్టు వెల్లడించారు.

మరోవైపు ఆప్ఘనిస్థాన్ లో భారత్ చేపట్టిన అభివృద్ధి ప్రశంసించదగినదని తాలిబన్ల అధికార ప్రతినిధి మహ్మద్ సుహైల్ షాహీన్ అన్నారు. రాయబార కార్యాలయాలపై దాడులు నిర్వహించేదిలేదని స్పష్టం చేశారు. అయితే ఆఫ్ఘాన్ ఆర్మీకి భారత్ సాయం చేయకపోతే అన్ని విధాలా మంచిదన్నారు. సైనిక జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పటికే అందరికీ అర్థమై ఉంటుందని తెలిపారు. ఆఫ్ఘాన్ లో ఇతర దేశాల జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు.

పష్తూన్ తెగకు చెందిన ముల్లా మహ్మద్ ఒమర్.. 1989లో పాక్ లోని మదర్సా విద్యార్థులతో కలిసి మిలిటెంట్ గ్రూప్ స్థాపించాడు. ఇందులో సభ్యులనే తాలిబన్లు అంటారు. అరబిక్ తాలిబన్ అంటే విద్యార్థి అని అర్థం. సోవియట్లను ఆప్ఘాన్ నుంచి తరిమివేయాలనే లక్ష్యంతో ఈ గ్రూప్ తయారు చేసినా.. 1994లో పలు ప్రాంతాలను ఆక్రమించుకొని ప్రభుత్వంపై తిరుగుబాటు చేసింది. షరియత్ చట్టాలు కఠినంగా అమలు చేస్తూ ఇప్పటికీ అరాచకాలు సృష్టిస్తోంది.

మొత్తానికి ఆప్ఘనిస్థాన్ రణరంగాన్ని తలపిస్తోంది. ఆ దేశ సైనికులకు.. తాలిబన్లకు మధ్య జరుగుతున్న పోరులో సామాన్యులు బలవుతున్నారు. ఇటు మన దేశ వాసులను అక్కడి నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేయాలని ఇప్పటికే భారత ప్రభుత్వం పిలుపునిచ్చింది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: