బాబు వ్యూహంతో ఆ మాజీ ఎమ్మెల్యే పరువు పోయిందా?
విషయంలోకి వెళ్తే.. గత మార్చిలో జరిగిన స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అన్ని చోట్లా ఓడిపోయింది. ఒక్క తాడిపత్రి మునిసిపాలిటీ తప్ప.. ప్రతి చోటా చతికిల పడింది. అదేసమయంలో వైసీపీ భారీ రేంజ్లో పుంజుకుంది. ఈ క్రమంలోనే చైర్మన్లు, వైస్ చైర్రన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లకు తోడు.. రెండో డిప్యూటీ మేయర్, రెండో వైస్ చైర్మన్ పదవులు కూడా తెరమీదికి తెచ్చారు. ఇలాంటి సమయంలో తగుదునమ్మా అంటూ.. టీడీపీ డిప్యూటీ మేయర్ పదవుల కోసం పోటీ పడడం.. వివాదంగా మారింది. ఎందుకంటే.. అప్పటికే టీడీపీకి బలం లేదని.. పార్టీ పరిస్థితి అయిపోయిందని చర్చ సాగుతున్న క్్మంలో మళ్లీ పోటీ పడి వైసీపీ చేతిలో ఓడిపోయి.. మరోసారి చర్చించుకునేలా టీడీపీ వ్యవహరించింది.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్గా వైసీపీ బలపరిచిన 17వ వార్డు కార్పొరేటర్ చోడిపల్లి సత్యప్రసాద్ విజయం సాధించారు. అయితే.. దీనికి ముందు.. టీడీపీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు దూరంగా ఉంటామని మాజీఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు బహిరంగ ప్రకటన చేశారు. అంటే.. తద్వారా.. వైసీపీకి పోటీ ఇవ్వకుండా.. అంతో ఇంతో సింపతీని గెయిన్ చేసుకోవచ్చని భావించారు. దీంతో మౌనంగా కూర్చునేందుకు టీడీపీ కార్పొరేటర్లు రెడీ అయి వచ్చారు.
అయితే.. అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి వనమాడికి ఫోన్ వచ్చింది. పోటీకి ఎందుకు పెట్టడం లేదని.. ఆయన గట్టిగా మందలించినట్టు టీడీపీ నేతల మధ్య చర్చకూడా జరిగింది. దీంతో డిప్యూటీ మేయర్ పదవి కోసం పోటీ చేయాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అయితే.. అప్పటి కప్పుడు నిర్ణయం తీసుకోవడం.. కార్పొరేటర్లకు సరైన అవగాహన కల్పించకపోవడం.. పైగా వైసీపీకి భారీ మెజారిటీ ఉన్న నేపథ్యంలో బాబు వ్యూహం అభాసుపాలైంది. అయితే.. ఈ ఎఫెక్ట్ మాజీ ఎమ్మెల్యే వనమాడిపై పడిందని.. ఆయన అలకపాన్పు ఎక్కారని అంటున్నారు తమ్ముళ్లు. ఇదీ సంగతి!