షాక్: హుజూరాబాద్ ఉప ఎన్నిక గోవిందా..?
హుజూరాబాద్ ఉపఎన్నిక సెప్టెంబర్లోనేనని పార్టీలన్నీ హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. నేతలంతా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ నాయకుల్ని ఆకర్షిస్తున్నారు. బీజేపీ ఇన్చార్జిలను నియమించి గోదాలోకి దూకింది. బీజేపీ దూకుడు చూసి ఇతర పార్టీల నాయకులు కూడా ఉపఎన్నిక ఖాయమనుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల సంఘం ద్వారా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఉపఎన్నిక పట్టేస్తుంది. ఈ విషయంలో హైకమాండ్ నుంచి సంకేతాలు ఉండటంతో సెప్టెంబర్లో ఉపఎన్నికకు సిద్ధమయ్యారని అంతా భావిస్తున్నారు. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని ఉత్తరాఖండ్ సంఘటనతో రుజువైంది.
ఉత్తరాఖండ్లో స్వయంగా తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి తీరథ్సింగ్ రావత్తో రాజీనామా చేయించారు. ఇది దేశంలోనే అనూహ్యమైన పరిణామంగా మారింది. ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడేలా ఖాళీలున్నా ఎన్నిక పెట్టడంలేదు. హుజూరాబాద్ లో మాత్రం ఉపఎన్నిక ఎలా పెడతారన్న సందేహం ఇప్పుడే అందరికీ వస్తోంది. అసలు తీరథ్ సింగ్తో రాజీనామా చేయించడానికి కారణమేంటని పరిశీలిస్తే.. ఈ ఏడాదిలో అసలు ఉపఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు ఏవైనా సరే వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి పెడతారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
పశ్చిమ బెంగాల్ సీఎం కూడా తన పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితిని సృష్టించడం కోసమే ఇలా చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక వేళ ఇలాంటి పరిస్థితి వచ్చినా కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు ప్రత్యేక పరిమితి ఇస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో హుజూరాబాద్ను ప్రత్యేకంగా తీసుకుని ఉపఎన్నిక పెట్టే అవకాశం లేదు. మరోవైపు కరోనా మూడోదశపై నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. దీన్ని కారణంగా చూపి ఓ చోట ఎన్నికలు నిర్వహించి.. మరో చోట నిర్వహించకుండా ఉండే పరిస్థితి తలెత్తదు. అందుకే హుజూరాబాద్పై రాజకీయ పార్టీలు ఎంత హడావిడి చేసినా ఉప ఎన్నిక ఉండదు అనే సమాచారాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రాజీనామాతో తెలియజేశారని భావిస్తున్నారు.