రేవంత్‌కు ప‌దవి.. టీ కాంగ్రెస్‌లో ముస‌లం.. సీనియ‌ర్ల రాజీనామాలు

VUYYURU SUBHASH
తెలంగాణ కాంగ్రెస్ ను ఎవ్వ‌రూ నాశ‌నం చేయ‌క్క‌ర్లేదు. ఆ పార్టీ వాళ్లే ఆ పార్టీని స‌ర్వ‌నాశ‌నం చేయడంతో పాటు నిలువునా ముంచేస్తార‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఒక్క ప‌ద‌వి కోసం చివ‌ర‌కు వార్డు మెంబ‌ర్ గా కూడా గెల‌వ‌లేని వీ హెచ్ లాంటి వాళ్లు సైతం రేసులో ఉంటారు. వి. హ‌నుమంత‌రావుకు ఏం త‌క్కువైంద‌ని.. ఆయ‌న్ను ఏకంగా మూడు సార్లు రాజ్య‌స‌భ‌కు ఎంపిక చేశారు. అయినా ఏదో ఒక అసంతృప్తి నిత్యం వెళ్ల‌గ‌క్కుతూనే ఉంటారు. ఇక రేవంత్ రెడ్డి కు టీ పీసీసీ రావ‌డం ముందు నుంచి ఇష్టం లేని నేత‌లు ఇప్పుడు గుర్రుగా ఉన్నారు.

ఇక కొంద‌రు నేత‌లు రేవంత్ రెడ్డి కు ప‌దవి రావ‌డంపై ఆగ్ర‌హంతో ఉంటే మ‌రి కొంద‌రు అక‌ల‌బూని రాజీనామాలు ప్రారంభించారు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఏఐసీసీ సభ్యత్వానికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ప్ర‌క‌టించారు. ఇక ఆయ‌న బాటలోనే మరికొందరు నేతలు రాజీనామా చేసే అవకాశముంది. ల‌క్ష్మారెడ్డి గ‌తంలో టీడీపీలో ఉండే వారు.. ఆ త‌ర్వాత ఆయ‌న వైఎస్ ద‌య‌తో మేడ్చ‌ల్ సీటు ద‌క్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచారు.

2009 ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఆయ‌న టీడీపీలో ఉండేవారు. చంద్ర‌బాబు ఆ ఎన్నిక‌ల్లో ల‌క్ష్మారెడ్డికి చేవెళ్ల ఎంపీ సీటు కూడా ఇచ్చారు. అయితే ఆయ‌న చివ‌ర్లో వైఎస్ పార్టీలోకి ఆహ్వానించి మేడ్చ‌ల్ సీటు ఇవ్వడంతో ఆ పార్టీలోకి జంప్ చేసేశారు. త‌ర్వాత కాంగ్రెస్ నుంచి ఆయ‌న రెండు సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేసినా గెల‌వ‌లేదు. పార్టీలో అవుట్ డేటెడ్ లీడ‌ర్ల‌లో ఒక‌రు అయిపోయారు. ఇప్పుడు రేవంత్‌కు ప‌ద‌వి ఇవ్వ‌డంతో అలిగి పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్టు చెప్పారు. ఏదేమైనా ఇలాంటి రాజీనామాలు టీ కాంగ్రెస్ లో మ‌నం మ‌రి కొన్ని చూస్తాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: