రైతుల మరణాలపై వ్యవసాయ మంత్రి వెటకారం.. నెటిజన్స్ ఆగ్రహం..!?

N.ANJI
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయం బిల్లులపై గత కొద్దీ రోజులుగా ఢీల్లీలో రైతులు ధర్నా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా అన్నదాతలు ఉక్కు సంకల్పంతో నిరసనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు రైతులు ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. ఉద్యమంలో ఊపిరొదిలిన రైతుల గురించి హరియాణా వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వ్యవసాయ శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తి చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక ఎక్కడ చనిపోతే ఏం..? ఇంట్లో ఉంటే మాత్రం చనిపోకుండా ఉంటారా..? వాళ్లు ఇష్టపూర్వకంగానే మరణించారు. కొన్ని లక్షల మంది జనాభాలో రెండు వందల మంది చనిపోతే అదేమంత పెద్ద విషయమా..?’ అంటూ మంత్రి అవహేలనగా మాట్లాడారు. వెటకారంగా మంత్రి పుల్లవిరుపు మాట్లాడటం తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.

తాజాగా, హరియాణా మంత్రి వ్యాఖ్యలను సంయుక్త కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండించింది. ఇక ఇటువంటి తప్పుడు కూతలు కూస్తే హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ల మాదిరిగా ‘నకిలీ జాతీయవాదం’ కాకుండా దేశంలోని రైతులు భారత సార్వభౌమాధికారం, ఐక్యత, గౌరవాన్ని కాపాడటానికి నిజమైన అంకితభావంతో ఉన్నారు’ అని ఎస్కేఎం నేత డాక్టర్ దర్శన్ పాల్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇక సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన రైతుల వివరాలు తమ వద్దలేవని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్కేఎం మండిపడింది. ‘ప్రభుత్వం పట్టించుకుంటే అటువంటి డేటా తక్షణమే లభించే బ్లాగ్ సైట్‌ను ఎస్కేఎం నిర్వహిస్తోంది. ఇంతవరకు చాలా మంది ప్రాణాలు కోల్పోయినా అదే నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది’ అని దుయ్యబట్టారు.

ఇక బీజేపీ రోజులు లెక్కబెట్టుకోవాల్సిందేనని, లక్షలాది మంది రైతులు చైతన్యవంతులవుతారని ఇంద్రీ మహాపంచాయత్‌ హెచ్చరించింది. కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రాలు, ప్రాంతాలు, మతాలకు అతీతంగా రైతులంతా ఏకమై సమస్య పరిష్కారం కోసం పోరాటం సాగిస్తామని కిసాన్ మోర్చా పునరుద్ఘాటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: