అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ టీంలో తెలంగాణ వాసి
జో బైడెన్ టీంలో మన తెలంగాణ వాసి కూడా ఒకరు ఉన్నారు. జో బైడెన్ బృందంలో మన తెలుగు వ్యక్తికి అరుదైన స్థానం దక్కింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చొల్లేటి వినయ్రెడ్డి అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పీచ్ డైరెక్టర్ల బృందంలో ఒకరిగా నియమితులయ్యారు. వినయ్రెడ్డి తండ్రి నారాయణరెడ్డి వృత్తిరీత్యా డాక్టర్. 40 ఏళ్ల క్రితం నారాయణ రెడ్డి కుటుంబంతో సహా అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వినయ్రెడ్డి అమెరికాలోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆంగ్లంపై మంచి పట్టు ఉండడంతో బాగా ఉన్నత స్థానానికి చేరారు. ఈ క్రమంలోనే బైడెన్ స్పీచ్ డైరెక్టర్గా ఎంపికయ్యేలా ఎదిగారు.
అమెరికాలో ఉన్నప్పటికీ వినయ్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి అప్పుడప్పుడు తెలంగాణలో ఉన్న సొంతూరికి వచ్చి పోతుంటారు. వినయ్రెడ్డి తండ్రికి పోతిరెడ్డిపేట గ్రామంలో ఇల్లు, వ్యవసాయ భూమి వంటి ఆస్తిపాస్తులు ఉన్నాయి. జన్మభూమిపై మమకారం ఉండటంతో గ్రామానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారని గ్రామస్తులు తెలిపారు. వినయ్రెడ్డికి బైడెన్ బృందంలో చోటు దక్కినందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇటు తెలంగాణ ప్రజలు కూడా ఈ విషయం తెలిసి ఆనందంతో సంబరపడిపోతున్నారు.