రేవంత్‌ పట్టాభిషేకంలో ట్విస్ట్...బీజేపీ మైండ్‌గేమ్...!

M N Amaleswara rao
తెలంగాణ కాంగ్రెస్‌లో ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో కిందకు పడిపోయిన పార్టీని పైకి లేపే పీసీసీ అధ్యక్షుడు ఎంపిక విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 2014 ఎన్నికల నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సరైన విజయం అందుకొని విషయం తెలిసిందే. అయితే పార్టీలో ఎన్ని మార్పులు తెచ్చినా అధికార టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ పోటీ ఇవ్వలేకపోయింది. తాజాగా జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. పైగా టీఆర్ఎస్‌కు పోటీగా బీజేపీ పార్టీ వచ్చేసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా చేయడంతో, కొత్త అధ్యక్షుడుని పెట్టే పనిలో కాంగ్రెస్ అధిష్టానం కసరత్తులు చేస్తుంది. ఈ పీసీసీ పదవికి పలువురు సీనియర్లు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పదవికి రాష్ట్రంలో ఫుల్ క్రేజ్ ఉన్న రేవంత్ రెడ్డికే కట్టబెట్టాలని అధిష్టానం నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేపోమాపో అధికారిక ప్రకటన కూడా వచ్చేస్తుందని ప్రచారం జరుగుతుంది.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్లు ఎప్పటిలాగానే అడ్డుపడటానికి చూస్తున్నారు. సీనియర్ నేత వి హనుమంతరావు అయితే ఓ అడుగు ముందుకేసి, రేవంత్‌రెడ్డికి పీసీసీ ఇస్తే.. తాను పార్టీలో ఉండనని స్పష్టం చేశారు. తనతో పాటు చాలా మంది ఎవరి దారి వాళ్లు చూసుకుంటారని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే జగ్గారెడ్డి, కోమటిరెడ్డి కూడా పనికి రారా? అని ప్రశ్నించారు. ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న రేవంత్‌కు పీసీసీ పగ్గాలు ఇస్తే.. తాము ఎలా కలిసి పని చేయాలన్నారు. అంటే పరోక్షంగా బీజేపీ గేమ్‌లో భాగంగానే రేవంత్ పనిచేస్తున్నారన్నట్లు వి‌హెచ్ మాట్లాడారు.

అయితే ప్రజల్లో రేవంత్‌ రెడ్డి కంటే తనకే ఎక్కువ క్రేజ్‌ ఉందని చెబుతున్న వి‌హెచ్‌ వెంట పది మంది నాయకులని తిప్పుకునే సత్తా ఉందా? అని రేవంత్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కేవలం రేవంత్‌కు పీసీసీ పగ్గాలు దక్కకుండా చేసేందుకే వి‌హెచ్ ఇలా మాట్లాడుతున్నారని ఫైర్ అవుతున్నారు. మరి చూడాలి ఈ పీసీసీ పదవిలో ఇంకా ఎన్ని ట్విస్ట్‌లు వస్తాయో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: