జనవరి 1నుంచి ఏపీలో ట్రాఫిక్ చలాన్ల బాదుడు భారీ స్థాయిలో మొదలవుతుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే అధికారులకు జారీ చేసింది రవాణా శాఖ. బైక్ తీసినా, కారు తీసినా.. రోడ్డుపైకి వెళ్లాలంటే పర్మిషన్, డ్రైవింగ్ లైసెస్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ తప్పనిసరి. వీటిలో ఏదీ లేకపోయినా చలాన్ పడిపోతుంది. మీరు ప్రెస్సా, పోలీసా, డాక్టరా, లాయరా.. ఇలాంటివేవీ పట్టించుకోరు. రికమండేషన్లు పనిచేయవు. చలాన్ రాయించుకుని వెళ్లాల్సిందే, లేకపోతే ఆన్ లైన్లో కట్టుకోవాల్సిందే. కరోనా కారణంగా ఇప్పటి వరకూ కాస్త లిబరల్ గా ఉన్నా.. జనవరి 1నుంచి ఈ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
వాహనానికి సంబంధించి ఏ పత్రం లేకపోయినా చలాన్ తోపాటు, కేసులు నమోదు చేసేందుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖకు ఆదేశాలిచ్చింది. కోవిడ్ కారణంగా రవాణా వాహనాల పర్మిట్లు, రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల గడువు ఫిబ్రవరితో తీరిపోయినా.. ఈ ఏడాది డిసెంబర్ వరకు చెల్లుబాటయ్యేలా లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాల ప్రకారం రవాణాశాఖ సాఫ్ట్ వేర్లో మార్పులు చేసి ఇప్పటి వరకూ ప్రజలకు వెసులుబాటు ఇచ్చారు. కేంద్రం ఇచ్చిన గడువు నెలాఖరుతో ముగుస్తుండటంతో.. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కఠినంగా రోడ్ సేఫ్టీ నిబంధనలు అమలు చేసేందుకు రవాణాశాఖ కింది స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చింది. దీంతో చెక్పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం అవుతాయని అంటున్నారు అధికారులు.
ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘనలకు సంబంధించి కొత్త నియమాల ప్రకారం చలాన్లు భారీగా పెరగబోతున్నాయి. జరిమానాలను భారీగా పెంచుతూ మోటారు వాహన చట్టంలో సెక్షన్ 177 నుంచి 199 వరకు ఉన్న నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త ఏడాదిలో రోడ్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ఉల్లంఘనుల భరతం పట్టబోతున్నారు. రవాణా వాహనానికి పర్మిట్ లేకపోయినా, పన్నులు చెల్లించకుండా వాహనం నడిపినా 200 శాతం జరిమానా విధిస్తారు. అంతర్ రాష్ట్ర పర్మిట్లపైనా రవాణాశాఖ దృష్టి పెట్టబోతోంది. వచ్చే ఏడాది నుంచి రవాణా వాహనాలకు సంబంధించి పూర్తిస్థాయి తనిఖీలు చేపడతామని సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీకి ఇటీవలే రవాణాశాఖ నివేదిక ఇచ్చింది.