గంటా వస్తారు సరే..! మిగతా వారి పరిస్థితేంటి ?
గంటా కూడా ఇప్పుడు జగన్ కు జై కొడితే, ఇంకా వాసుపల్లి గణేష్, వెలగపూడి రామకృష్ణబాబు మాత్రమే విశాఖ టిడిపిలో ఉంటారు. గణబాబు సైతం ఇప్పటికే వైసిపి బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు ఆయన వైసీపీ అధిష్టానానికి సంకేతాలు కూడా పంపించారు. అయితే వెలగపూడి రామకృష్ణ బాబు మాత్రం టిడిపి వీడే అవకాశం కనిపించడం లేదు. కృష్ణా జిల్లాకు చెందిన రామకృష్ణ బాబు మొదటి నుంచి టిడిపిని అంటిపెట్టుకుని ఉంటున్నారు. అదీ కాకుండా, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా నమ్మకస్తుడిగా ముద్ర వేయించుకోవడంతో ఆయన వైసీపీ లోకి వచ్చి చేరే అవకాశం కనిపించడం లేదు.
కానీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణ బాబు మాత్రం మరి కొద్ది రోజుల్లోనే వైసీపీకి జై కొట్టబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నెలకొన్న ఈ పరిణామాలు టిడిపిలో మరింత ఆందోళన పెంచుతున్నాయి. పార్టీ నేతల్లో భరోసా కల్పించే విధంగా పార్లమెంటరీ ఇంచార్జీలను నియమిస్తూ, రాష్ట్ర కార్యవర్గంలో కూడా మార్పులు చేర్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో, ఇప్పుడు వలసలు పెరిగిపోవడం టిడిపికి మింగుడు పడడం లేదు. వీరే కాకుండా మిగతా జిల్లాల నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీ బాట పట్టే ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఈ వ్యవహారాలన్నీ బాబు కి మరింత అసహనాన్ని కలిగిస్తున్నాయి.