గీత దాటారో కాల్చిపారేస్తాం ! కిమ్ మరోసారి వార్నింగ్ లు

నియంత పరిపాలనలో ఆరితేరిపోయిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారో అందరికీ తెలిసిందే. ప్రపంచమంతా ఒక దారిలో నడిస్తే, తాను మరో దారిలో నడుస్తా అన్నట్లు గా వ్యవహరిస్తూ ఉంటారు. రాక్షస పాలనతో సొంత దేశ ప్రజలకు నిత్యం నరకం చూపిస్తూ ఉంటారు. అలాగే సరిహద్దు దేశాలతో ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు. కిమ్ తీసుకునే నిర్ణయం ఆ దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగానూ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతుండడంతో, ఉత్తర కొరియా కు కరోనా రాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం సరిహద్దు దేశాలతో ఆయన తరచుగా వివాదాలు పెట్టుకుంటున్నారు. తమ దేశంలోకి ఇతర దేశస్తులు ఎవరూ రాకుండా ఇప్పటికే కఠినమైన నిబంధనలు విధించారు. అంతే కాకుండా రహస్యంగా ఉత్తర కొరియా లోకి అడుగుపెట్టాలని  చూస్తే కాల్చి పారేయాలి అంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు.


ముఖ్యంగా తమ సరిహద్దు ప్రాంతమైన దక్షిణకొరియా దేశస్థులు తమ దేశంలోకి వచ్చేందుకు ప్రయత్నించినా ఊరుకునేది లేదని గతంలోనే కిమ్ హెచ్చరికలు చేశారు. తాజాగా దక్షిణ కొరియాకు చెందిన ఓ అధికారిని ఉత్తరకొరియా సరిహద్దుల్లో సంచరించాడనే కారణంతో ఆయన్ను కాల్చి చంపడం కలకలం రేపుతోంది. దీనిపై చాలా దేశాలు కిమ్ తీరును తప్పుబడుతూ హడావుడి చేస్తున్నాయి. ఒక అధికారి సరిహద్దులో సంచరిస్తున్నాడు అని తెలిసి కూడా, సైన్యం అతడిని కాపాడే ప్రయత్నం చేయలేదని, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

 ఇప్పటికే ఈ వ్యవహారం పై కిమ్ క్షమాపణలు చెప్పారు. అసలు కిమ్ క్షమాపణ చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఇదే మొదటిసారి. అయినా దక్షిణ కొరియా తమపై పదేపదే ఆరోపణలు చేస్తుండడంతో ఆగ్రహం చెందిన ఆయన, దక్షిణ కొరియాకు గట్టి వార్నింగ్ పంపించారు. సారీ చెప్పానని ఆషామాషీగా తనను లెక్క వేయొద్దని, తేడా వస్తే ఎవరినీ ఉపేక్షించబోనని గట్టి వార్నింగ్ ఇచ్చారు. దక్షిణ కొరియాకు చెందిన అధికారిని తాము కాల్చిచంపిన మాట వాస్తవమేనని, ఆ మృతదేహం దొరికితే వెంటనే అప్పగిస్తామని కిమ్ వ్యాఖ్యానించారు.


ప్రస్తుతం ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్య తీవ్రస్థాయిలో వివాదం చెలరేగుతోంది. కేవలం దక్షిణ కొరియా మాత్రమే కాకుండా, ఉత్తర కొరియాతో సరిహద్దును పంచుకుంటున్న దేశాలు అన్నీ ఇప్పుడు తీరుపై ఆగ్రహంగా ఉన్నాయి. కిమ్ మాత్రం తమ సరిహద్దులోకి వచ్చేందుకు ఎవరూ ప్రయత్నం చేయవద్దని, అలా ప్రయత్నిస్తే కాల్చి పారేస్తాం అంటూ హెచ్చరికలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: