కరోనాతో భర్త మృతి.. భార్య బిడ్డలు ఏం చేశారో తెలుసా..?

praveen
కరోనా... కనీసం కరుణ లేకుండా ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. మానవ జీవితాన్ని మొత్తం అతలాకుతలం చేస్తూ పంజా విసురుతోంది. రోజు  రోజుకు శర వేగంగా వ్యాప్తి చెందుతూ.. ఎంతోమందిని మృత్యువుతో పోరాడేలా చేస్తుంది కరోనా  వైరస్.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కరోనా  నియంత్రణ మాత్రం రోజురోజుకు కష్టం గానే మారుతుంది. వెరసి ప్రజల్లో తీవ్ర భయాందోళన పాతుకు పోతుంది. కరోనా  వైరస్ ఎంతో మంది ఇంటి పెద్దలను చంపేసి కుటుంబాలను రోడ్డున పడేస్తున్న హృదయ విదారక ఘటనలు ఎన్నో చూస్తున్నాం.



 ఎంతో మందిని మానసికంగా చంపేసి చివరికి బలవన్మరణానికి పాల్పడే  లాంటి పరిస్థితులను తీసుకొస్తుంది కరోనా వైరస్. ఇటీవలే విశాఖ  లో ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. కాగా  ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే... స్థానికంగా ఉండే  తుమ్మల రమేష్ కుమార్ అనే వ్యక్తి ఇటీవలే కరోనా  వైరస్ బారిన పడ్డాడు. చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన రమేష్ కుమార్ ఆరోగ్యం క్రమ క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఆరోగ్యం విషమించి కన్నుమూసారు రమేష్ కుమార్. ఇక ఈ విషయం భార్య ఇద్దరు కుమార్తెలకు  తెలిసి ఒక్క సారిగా గుండె పగిలిపోయింది. ఇంటి పెద్ద లేని జీవితాన్ని ఊహించుకోలేను పోయారు. మానసికంగా కలతచెంది వెంటనే శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు,




 అయితే ఈ విషయాన్ని వెంటనే గమనించిన స్థానికులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన ముగ్గురిని సమీప ఆసుపత్రికి తరలించగా... మెరుగైన చికిత్స కోసం వెంటనే వారిని కేజీహెచ్  ఆస్పత్రికి తరలించాలి అంటూ వైద్యులు సూచించారు. దీంతో వెంటనే బాధితులను కేజీహెచ్ హాస్పిటల్ కి చికిత్స కోసం తరలించారు స్థానికులు. కాగా ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేపింది. ఇలా ఇంటి పెద్దను  బలి తీసుకుంటున్న కరోనా  వైరస్... కుటుంబ సభ్యులను మానసికంగా కుంగుబాటుకు గురిచేసి బలవన్మరణాలకు పాల్పడేలా  చేస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: