ఫేస్ బుక్ ప్రేమ.. సహజీవనం.. కానీ ఆ తర్వాతే..?
తాజాగా ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఓ యువతిని ప్రేమించి ఆమెతో కొన్నాళ్ల పాటు సహజీవనం చేశాడు. కానీ ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా వేరే యువతిని పెళ్లి చేసుకొని ప్రియురాలిని నట్టేట ముంచాడు ఇక్కడొక మోసగాడు. చేసేదేమీలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధి బహదూర్ గూడా కు చెందిన రాజ్ కుమార్ అనే ఫోటోగ్రాఫర్.. కొంతకాలం క్రితం హైదరాబాద్ కు చెందిన ఓ యువతితో ఫేస్ బుక్ లో పరిచయం పెంచుకున్నాడు. రోజు ఆమె తో చాటింగ్ చేస్తూ మాయ మాటలు చెబుతూ ఆమెను క్రమక్రమంగా ప్రేమ అనే ఉచ్చులోకి దింపడం మొదలుపెట్టాడు.
ఆ యువతి ప్రేమను ఒప్పుకోగానే పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొన్ని రోజుల పాటు ఆ యువతితో సహజీవనం చేశాడు. మానసికంగా శారీరకంగా వాడుకున్నాడు. ఆ యువతి ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకురావడంతో మాట దాట వేసి ముఖం చాటేశాడు. ఆ యువతి పై మోజు తీరాక గుట్టుగా వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతుండడంతో అనుమానం వచ్చిన బాధితురాలు నిలదీయగా పొంతనలేని సమాధానం చెప్పాడు. దీంతో కాస్త లోతుగా ఆరా తీయగా రాజ్ కుమార్ కి ఇటీవలే పెళ్లి జరిగింది అని తెలుసుకుంది యువతి. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు రాజ్ కుమార్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.Powered by Froala Editor