దేశం మునిగిపోయే పరిస్థితి... నేను భయంకర హిందువును
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఫలితాల గురించి మాట్లాడిన అనంతరం... ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ప్రాంతీయ అంశాల నుంచి మొదలుకొని జాతీయ అంశాల వరకు ఆయన తనదైన శైలిలో కేసీఆర్ విశ్లేషించారు.
దేశంలోని రాజకీయవేత్తల్లో తనకు మించిన హిందువు ఎవరు ఉన్నారని కేసీఆర్ అన్నారు. దేశంలో తాను చేసినన్ని యాగాలు ఎవరూ చయలేదని కేసీఆర్ అన్నారు. తాను భయంకరమైన హిందూవునని సీఎం కేసీఆర్ అన్నారు. తాను లక్షల మందిని పిలిచి అన్నం పెట్టి యాగాలు చేశానన్నారు. తాను బాజాప్త హిందూవనని ఎవరికీ భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.పొద్దున్న లేస్తే గాయత్రీ మంత్రం చదువుతానన్నారు. బీజేపీ వాళ్లు చెబితేనే చదువుతారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పౌరసత్వ సవరణ చట్టం గురించి స్పందిస్తూ సీఏఏతో దేశానికి నష్టమన్నారు. ఇదో పనికిమాలిన లొల్లి అన్నారు. దేశం మునిగి పోయే పరిస్థితి ఉంటే మౌనంగా ఉండకూడదని కేసీఆర్ అన్నారు. ప్రపంచంతో కలిసి బతకాలని కేసీఆర్ హితవు పలికారు. మన వాళ్లు బయటి దేశాల్లో 10 కోట్ల మంది ఉన్నారని...వాళ్ల పరిస్థితి ఏంటని కేసీఆర్ ప్రశ్నించారు. ఎలాంటి ఎలాంటి దుష్ట శక్తుల్ని తీసి పారేశామో మీకు తెలీదా అన్నారు. త్వరలో ఎన్ఆర్ఐ బీజేపీ తప్పుడు నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్నారు.
కాగా, రెవిన్యూ డిపార్ట్మెంట్లో అవినీతి వ్యవహారంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఎక్కువగా ఉన్న డిపార్ట్మెంట్ ఏదంటే నెంబర్ వన్ రెవెన్యూ శాఖనే అని కేసీఆర్ అన్నారు. ఇటీవల ఎమ్మార్వో కార్యాలయాలకు పెట్రోల్ డబ్బాలు తీసుకురావడం ఎక్కువైందని, ఎంత బాధ ఉంటే ప్రజలు అలా చేస్తారని సీఎం అన్నారు. దీనిపై ఆ డిపార్ట్మెంట్ వాళ్లు కూడా ఆలోచించుకోవాలని హితవు చెప్పారు, రెవిన్యూ ఉద్యోగులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. అంతులేని పైసలు ఏం చేసుకుంటారు? అని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగులనుద్దేశించి సీఎం ప్రశ్నించారు. రెవెన్యూ శాఖలో అవినీతి, అరాచకం, విచ్చలవిడి తనాన్ని ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. ఎవరు ఏమనుకున్నా భయపడేది లేదన్నారు. ప్రజలే తమ బాస్లు అని పేర్కొన్నారు. ప్రభుత్వాల్నే ప్రజలు తీసి పారేస్తున్నారని, అలాంటి రెవెన్యూ శాఖ ఒక లెక్కా? అని వ్యాఖ్యానించారు. త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని కచ్చితంగా తీసుకొస్తామని స్పష్టం చేశారు.