ప్రేమ కోసమేనా అయేషా..?
ఇప్పటివరకు ఏంజరిగిందంటే..
అప్పట్లో విచారణ జరిపిన పోలీసులు మహిళా కోర్టుకు అందించిన ఆధారాల్లో చూపిన డీఎన్ఏ నిజంగా ఆయేషాదేనా అనే సందేహం సీబీఐకి రావటంతో కేసును మొదటి నుంచి తవ్వి తీసేందుకు రీపోస్టుమార్టం కోసం కోర్టును ఆశ్రయించారు. వారి అప్పీలుపై విచారణ జరిపిన విజయవాడలోని 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ నెల 7న అంగీకారం తెలిపింది. దీనిపై ఇప్పటి వరకు గోప్యత పాటించిన సీబీఐ అధికారులు తాజాగా ఆయేషా కేసు వాదిస్తున్న అడ్వొకేట్ శ్రీనివాస్ను, ఇతర శాఖల అధికారులను సంప్రదించడంతో విషయం బయటకు వచ్చింది. కోర్టు నుంచి, తల్లిదండ్రుల నుంచి అంగీకారం రావటంతో సీబీఐ విచారణను వేగం పెంచే అవకాశం ఏర్పడింది. రీపోస్టుమార్టం చేసేందుకు సీబీఐ అధికారులు తెనాలి చేరుకోనున్నారు.రెవెన్యూ అధికారుల సమక్షంలో వారి సహకారంతోనే పోస్టుమార్టం చేయాల్సి ఉంది. ఆ ప్రక్రియ నంతా వీడియోలో రికార్డు చేసి కోర్టుకు సమర్పించాల్సి ఉంది. 31 మార్చి 2017న హైదరాబాదు హై కోర్టు సత్యం బాబును నిర్దోషిగా ప్రకటించినది. నిష్కారణంగా ఒక నిర్ధోషిని 8 ఏళ్ళు జైలులో ఉంచినందుకు పోలీసు యంత్రాంగానికి మొట్టికాయలు వేస్తూ లక్ష రూపాయలను నష్టపరిహారం విధించినది. ఆయేషాను సత్యంబాబే హత్య చేశారనేందుకు నిర్దిష్టమైన ఆధారాలను చూపడంలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారని ధర్మాసనం పేర్కొంది. పోలీసులు ఎవరో ఒకరిని నేరస్తునిగా చూపాలన్న దిశగానే దర్యాప్తు చేశారే తప్ప, అసలైన నిందితులను పట్టుకునే ఉద్దేశంతో దర్యాప్తు చేయలేదని హైకోర్టు ఆక్షేపించింది. పోలీసులు చెప్పిన సిద్ధాంతాన్నే కింది కోర్టు విశ్వసించిందని తెలిపింది. సత్యంబాబుపై ఉన్న కేసులను కోర్టులు కొట్టేసినప్పటికీ, అతన్ని పోలీసులు కరగడుగట్టిన నేరస్తుడిగా చిత్రీకరించారని పేర్కొంది. శక్తివంతమైన రాజకీయ కుటుంబాన్ని కాపాడేందుకు పోలీసులు తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని సత్యంబాబు చెబుతున్న దానిపై అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు తమ ముందున్న సాక్ష్యాలు సరిపోవడం లేదని తెలిపింది.
హైకోర్టు ఏంచెప్పిందంటే..
హైకోర్టు వెలువరించిన తీర్పుతో సత్యంబాబు స్వగ్రామమైన కృష్ణా జిల్లా నందిగామ పట్టణ శివారు అనాసాగరంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తన కుమారుడి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సామాన్యులకు సైతం న్యాయం జరుగుతుందని, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందన్న విషయం రుజువైందని అతని తల్లి మరియమ్మ అన్నారు. రోజూ తన కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. సత్యంబాబు నిర్దోషి అని హైకోర్టు ప్రకటించిన నేపథ్యంలో అసలు దోషులెవరో తేల్చేందుకు కేసును పునర్విచారించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. తాజాగా సిబిఐ రంగంలోకి దిగింది. ఇప్పటికైనా ఈ కేసులో అసలు దోషులు బయటకి వస్తారని ఆశిద్దాం.