రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గంలోని ఉప కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని తాజాగా వైసీపీ అధినేత, సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. దీనిని ఎవరూ తప్పుపట్టడం లేదు. అయితే, అదేసమయంలో ఆయన వేస్తున్న అడుగులతో మాత్రం ఏమేరకు ప్రయోజనం ఉంటుంది? అనేది మాత్రం చర్చకు దారితీస్తోంది. మొత్తంగా 16 ఉప కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో జగన్ నిర్ణయించుకున్నారు. కార్పొరేషన్ల ఏర్పాటు మంచిదే.
అయితే, దీనివల్ల ఒనగూరే ప్రయోజనం ఎంత? ప్రభుత్వ లక్ష్యం ఏమిటి? వీటి ఏర్పాటుతో ఈ లక్ష్యం నెరవేరుతుందా? అనేది కీలకంగా మారింది. నిజానికి గత ప్రభుత్వం కూడా రాజకీయంగా తమకు లబ్ధి చేకూరుతుందని, తమపై ఒత్తిడి తగ్గడంతోపాటు.. సామాజిక వర్గాలు మొత్తంగా తమతోనే ఉంటాయని భావించి కాపు కార్పొరేషన్ సహా బ్రాహ్మణ, వైశ్య, మైనార్టీఅంటూ.. అనేక కులా లకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బడ్జెట్లో నిధులు ఏర్పాటు చేసింది.
అయితే, ఎన్నికల్లోకి వచ్చే సరికి టీడీపీకి దక్కిన ఓట్లు, ఆయా కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా పొందిన లబ్ధిని బేరీజు వేసుకుంటే సాధించింది చాలా తక్కువేననే విషయం స్పష్టంగా తెలుస్తోంది. పైగా, కాపు కార్పొరేషన్కు కేటాయించిన నిధులు కూడా పక్కదారి పట్టాయని, కేవలం పదవులు, కీలక నేతలను కాపాడుకునేందుకే ఇవి ఉప యోగపడ్డాయనే వ్యతిరేక ప్రచారం మూటగట్టుకుంది. కట్ చేస్తే.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 16 కార్పొరేషన్ల అవ సరం ప్రస్తుతానికి ఏముందనేది కూడా తెరమీదికి వస్తున్న ప్రశ్న.
కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా కులాల కు న్యాయం జరగడం అనేది పెద్దగా ప్రయోజనం లేని విషయంగా మేదావులు సైతం చెబుతున్నారు. బీసీల్లోనే వెనుకబడిన వర్గాలను గుర్తించి వారిని అన్ని విధాలా ప్రభుత్వమే నేరుగా ఆదుకోవడం ద్వారా దీనికి మించిన ఫలితాలను సొంతం చేసుకునే అవకాశం అటు సామాజిక వర్గాలకు, ఇటు ప్రభుత్వానికి కూడా ఉందని సూచిస్తున్నారు. ఈ విషయంలో జగన్ పునరాలోచించుకుని వ్యూహం ప్రకారం ముందుకు సాగాలని చెబుతున్నారు.