అదృష్టంలో దురదృష్టం అంటే ఏంటి? అదిరిపోయే అవకాశంలో అంతకంటే దరిద్రం మెడకు చుట్టుకుంటే...ఎలా ఉంటుంది? ఫ్యామిలీ ఫ్యామిలీ బ్యాడ్టైంతో బతికేయడం అంటే ఏంటి? వీటన్నింటి గురించి తెలియాలంటే..పెద్ద గ్రంథాలు చదవక్కర్లేదు. సింపుల్గా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని జేడీఎస్ పార్టీ నేతలు దేవేగౌడ, కుమారస్వామి గురించి కాస్త లోతుగా తెలిస్తే సరిపోతుంది. కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న సీఎం కుమారస్వామి రెబెల్ ఎమ్మెల్యేగా కారణంగా ముప్పులో పడిన సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ను మించిన ఉత్కంఠతో ఈ పరిణామాలు మారుతున్నాయి. అయితే, ఇది కుమరస్వామికే కాదు...ఆయన తండ్రికి కూడా ఎదురైన సందర్భంగా పలువురు పేర్కొంటున్నారు.
కర్ణాటకలో బలమైన ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్కు నాయకత్వం వహిస్తున్న గౌడ కుటుంబం ఎప్పుడూ పూర్తి కాలం అధికారంలో కొనసాగలేదనే వాదనలు ఉన్నాయి. 1996 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 161 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలువగా కాంగ్రెస్ 140 సీట్లకే పరిమితమైంది. పలు పార్టీల అగ్రనేతలు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అనూహ్యంగా దక్షిణాది నుంచి రెండో ప్రధానిగా జేడీఎస్కి చెందిన దేవెగౌడ జూన్ 1న ప్రమాణస్వీకారం చేశారు. 11 నెలలకే ఆ పదవిని కోల్పోయారు. ఆయన కుమారుడు కుమారస్వామి ప్రస్తుతం అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 2018 కర్టాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా కాంగ్రెస్ 80 సీట్లకే పరిమితమైంది. 37 స్థానాల్లో గెలిచిన జేడీఎస్ అనూహ్యంగా కాంగ్రెస్ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. తండ్రి మాదిరిగానే కుమారస్వామి 13 నెలల పాలనలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు.
సంకీర్ణ సర్కార్ను సజావుగా నడిపేందుకు తన బాధ చెప్పుకోలేనిదని, ప్రతిరోజు అనుభవించాల్సిందేనని ఆయన బహిరంగంగానే..ఏడ్చేశారు. సీఎం కుమారస్వామి మీడియా ముందు తన గుండెల్లోని వేదనను వెళ్లగక్కారు. అందరి అంచనాలను నెరవేరుస్తానని నేను హామీ ఇస్తున్నా. ప్రభుత్వ నిర్వహణలో ప్రతిరోజు నా బాధను ఎవరికీ చెప్పుకోలేను. దాన్ని మీతో పంచుకోవాలని ఉన్నా, అలా చేయలేను. ఈ రాష్ట్ర ప్రజల బాధను తీరుస్తాను అని అన్నారు. ఒక జేడీఎస్ ఎమ్మెల్యేకు బీజేపీ రూ.10 కోట్లు ఇవ్వజూపిందని కుమారస్వామి ఆరోపించారు. బీజేపీ నేత నుంచి ఫోన్ వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే నాకు ఫోన్ చేశారు. జేడీఎస్ను వీడి బీజేపీలో చేరితే రూ.10 కోట్లు ఇస్తామన్నారు. బీజేపీ నేతలు నిరంతరం ఇలాంటి ప్రలోభాలకు గురి చేస్తున్నా.. దేవుడి దయ, మీ ఆశీస్సులతో మరో నాలుగేళ్లు ఈ ప్రభుత్వం సురక్షితంగా ఉంటుంది అని గత నెలలో ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఆయన ఆశలు అడియాసలే అయ్యాయి. ప్రభుత్వం కూలిపోయే స్థితికి చేరుకుంది.