అడ్డంగా బుక్కయిన తెలంగాణ బీజేపీ నేతలు...అమిత్షా ఆగ్రహం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పక్కా ప్రణాళికలు, సమగ్ర కార్యాచరణకు అమిత్షా కేరాఫ్ అడ్రస్. అలాంటి నేత ముందు రాష్ట్ర స్థాయి నాయకులు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి? ఆయన సమక్షంలో జరిగే వాటిని ఎంత సీరియస్గా తీసుకోవాలి? అవేమీ చేయకపోవడంతో...తెలంగాణ బీజేపీ నేతలు అమిత్ షా చేతిలో అడ్డంగా బుక్కయ్యారు. దీంతో ఆగ్రహానికి గురయ్యారు.
కేంద్ర హోం మంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శనివారం హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా రంగనాయక్ తండాకు వెళ్లి.. సోనీబాయ్ నాయక్ కుటుంబానికి పార్టీ సభ్యత్వం ఇచ్చారు. తన పర్యటన, రాక సందర్భంగా నేతలు హడావుడి పడుతుండటంతో అమిత్ షా సీరియస్ అయ్యారు. ఎందుకు తొందర పడుతున్నారంటూ అమిత్ షా కోపం ప్రదర్శించారు. ఇక ఆ తర్వాత కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనిబాయి నాయక్ కు బీజేపీ సభ్యత్వ పేపర్ అందజేసే సమయంలోనూ నేతల తీరుపై అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం, స్కూల్లో మొక్క నాటే సమయంలోనూ నేతల తీరుపై అమిత్ షా కోపానికి వచ్చారు. మట్టి నింపేందుకు అక్కడ రాష్ట్ర నాయకులు పార ఏర్పాటు చేయలేదు. పార తెప్పించేందుకు అప్పటికప్పుడు ప్రయత్నం చేశారు. వేరేవాళ్లను నేతలు పురమాయించారు. దీంతో.. అమిత్ షా కోపం ప్రదర్శించారు. కోపంతో చేతులతోనే గుంతలో అమిత్
షా మట్టిని నింపారు. ఇలా రెండు సందర్భాల్లో రాష్ట్ర బీజేపీ నేతలపై ఫుల్ సీరియస్ అయ్యారు.