అగ్రవర్ణంగానే ఉన్నప్పటికీ.. అటు ఆర్థికంగాను, ఇటు రాజకీయంగాను పెద్దగా గుర్తింపునకు నోచుకోని వర్గం బ్రాహ్మణ సామాజిక వర్గం. ఎవరెవరు రాజకీయాల్లో ఉన్నా.. పార్టీ అధినేతలైనా.. బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇస్తామని చెబుతున్నారే తప్ప.. నిజానికి చేతల్లో చేసి చూపింది కానీ, చేస్తోందికానీ పెద్దగా మనకు ఎక్కడా కనిపించడం లేదు. కానీ, ఏపీ విపక్షం వైసీపీ అధినేత జగన్ మాత్రం బ్రాహ్మణ వర్గం విషయంలో చాలా సంచలన నిర్ణయం తీసుకుని ముందుకు సాగారు. ఇప్పటి వరకు అంటే.. గడిచిన రెండు దశాబ్దాల ఎన్నికలను తీసుకుంటే.. ఏపీలో బ్రాహ్మణ వర్గానికి పెద్దగా ప్రాధాన్యం ఉండడం లేదు. ఒకటి రెండు నియోజకవర్గాలను ఈ వర్గం వారికి కేటాయించడం పెద్ద ఇష్యూగా మారుతోంది.
ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తున్నామని చెబుతున్న పార్టీలు కూడా బ్రాహ్మణ వర్గానికి వచ్చే సరికి మాత్రం అత్తెసరు న్యాయంతోనే సరిపెడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, ఇప్పుడు తాజాగా జరుగుతు న్న ఎన్నికల్లో మాత్రం వైసీపీ బ్రాహ్మణ వర్గానికి చెందిన నలుగురికి టికెట్లు ఇవ్వడం ద్వారా సంచలనానికి తెరదీసిందని అంటున్నారు పరిశీలకులు. తాజాగా ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసిన జగన్ నాలుగు స్థానాల్లో సామాజిక సమీకరణలను సైతం లెక్క చేయకుండా.. తన సొంత సామాజిక వర్గం రెడ్లే వద్దని చెప్పినా.. బ్రాహ్మణులను ఎంపిక చేసి టికెట్లు ఖరారు చేశారు. దీంతో జగన్ ఇప్పుడు బ్రాహ్మణ పక్షపాతిగా మారారని అంటున్నారు పరిశీలకులు.
ఇక, నియోజకవర్గాల విషయానికి వస్తే.. కాపుల ప్రభావం ఎక్కువగా ఉన్న.. విజయవాడ సెంట్రల్ను అదే సామాజిక వర్గానికి చెందిన , మాస్ నాయకుడు, వంగవీటి వారసుడు రాధాను సైతం కాదని, ఆయన పార్టీ నుంచి వెళ్లిపోతానని బెదిరించినా పట్టించుకోకుండా.. బ్రాహ్మణ వర్గానికి చెందిన మల్లాది విష్ణుకు కేటాయించారు. అదేవిధంగా రాజధాని గుంటూరు జిల్లాలోని బాపట్ల లో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇదే సామాజిక వర్గానికి చెందిన కోన రఘపతికి టికెట్ ఇచ్చారు. వాస్తవానికి కోనకు టికెట్ ఇవ్వవద్దని... జగన్ సామాజికవర్గం ఎన్నిఆటంకాలు ,ఆందోళనలు చేసినా .. చివరకు జగన్ కోనకే టికెట్ ఇచ్చి బ్రాహ్మణ వర్గానికి ప్రాధాన్యం తగ్గదని నిరూపించారు.
అదేసమయంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పార్టీలో చేరిన ద్రోణంరాజు శ్రీనివాస్కు వెంటనే టికెట్ ఖరారు చేశారు. విశాఖ సౌత్లో బీసీ వర్గం డిమాండ్ ఎక్కువ. ఇక్కడ వీరిదే ఆధిపత్యం. అయినా కూడా బీసీ అభ్యర్దలను కాదని బ్రహ్మణులకే ఈ స్ధానం ఇస్తానని చెప్పి ద్రోణంరాజుకు టికెట్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నాడు. అదేవిధంగా.. విశాఖ తూర్పులో బలమైన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి శ్రీరామకృష్ణబాబుపై బ్రాహ్మిన్ అయిన అక్కరమాని విజయనిర్మలను దింపారు జగన్. నిర్మల భర్త యాదవ వర్గానికి చెందిన నాయకుడే అయినా.. ఆమె బ్రాహ్మిన్ కావడం గమనార్హం. మొత్తానికి జగన్ చేసిన సాహసం రాష్ట్ర రాజకీయాల్లోనే తొలిసారి సంచలనంగా మారిందని అంటున్నారు పరిశీలకులు.