తెలుగుదేశంపార్టీ ప్రత్తిపాడు ఎంఎల్ఏ, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు నిరాహార దీక్షకు దిగారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని పటిష్టం చేయాలనే డిమాండ్ తో ఈరోజు అమరావతిలోని సచివాలయంలో దీక్షకు కూర్చున్నారు. హటాత్తుగా మాజీ మంత్రి దీక్షకు కూర్చోవటంతో ప్రభుత్వంతో పాటు అధికార పార్టీ బిత్తరపోయింది. ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టం దుర్వినియోగం అవుతోందనే ఫిర్యాదుపై సమీక్షించాలని సుప్రింకోర్టు నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే.
సుప్రిం తీర్పుపై మండిపడుతున్న రావెల
ఎప్పుడైతే సుప్రింకోర్టు నిర్ణయం తీసుకుందో అప్పటి నుండి ఎస్సీ, ఎస్టీ వర్గాలు, సంఘాలు ఆందోళనకు దిగాయి. అందులో భాగంగానే రావెల కూడా ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు నిరాహారదీక్షకు దిగారు. అధికార పార్టీ ఎంఎల్ఏ అయ్యుండీ నిరాహార దీక్షకు దిగటంతో పలువురు ఆశ్చర్యపోతున్నారు. సుప్రింకోర్టు తీర్పు ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగారుస్తోంది రావెల మండిపడుతున్నారు. సుప్రింకోర్టు ఆదేశాలను పక్కనబెట్టి ఆర్డినెన్స్ ద్వారా చట్టాన్ని పరిరక్షించాలంటూ డిమాండ్ చేశారు. అయితే రావెల దీక్ష మొన్న సిఎం రమేష్ చేసినట్లు ఆమరణ నిరాహార దీక్ష లాగ కాకుండా ఈరోజు రాత్రి 7 గంటల వరకే చేస్తుండటం గమనార్హం.
టిడిపి నేతలే దీక్షలకు దిగుతున్నారు
దీక్షలు ఈమధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయాయి. ఒకపుడు ప్రభుత్వ విధానాలకు నిరసనగా ప్రతిపక్షాల నేతలు లేకపోతే ప్రజాప్రతినిధులు దీక్షలకు దిగేవారు. కానీ ఇపుడు అధికార పక్షానికి చెందిన ప్రజా ప్రతినిధులు కూడా దీక్షలకు దిగుతుండటం మామూలైపోయింది. ఈ మధ్య ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు డిమాండ్ తో కడపలో టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ 11 రోజులు నిరాహార దీక్ష అందిరికీ తెలిసిందే. అంతకుముందు విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ డిమాండ్ తో అనకాపల్లి టిడిపి ఎంపి అవంతి శ్రీనివాస్ ఒక్కరోజు దీక్షను అందరూ చూసిందే. తాజాగా రావెల దీక్ష మూడోది.