కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా చేశారు. అసెంబ్లీలో బల నిరూపణలో విఫలమైన యడ్డీ వేరే దారిలేక తన పదవికి శనివారం సాయంత్రం రాజీనామా చేశారు. 23వ ముఖ్యమంత్రిగా రెండు రోజుల క్రితమే ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప ఈరోజు రాజీనామా చేయటం విచిత్రం. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో జనాలు ఏ పార్టీకి కూడా పూర్తిస్ధాయిలో మద్దతివ్వలేదు. దాంతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 104 స్ధానాలతో మొదటి స్ధానంలో నిలిచిన బిజెపిని ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. దాంతో బిజెపి తరపున యడ్యూరప్ప సిఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
రెండు రోజుల్లో ప్రమాణం..రాజీనామా
ఎప్పుడైతే యడ్డీ సిఎంగా బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుండే కర్నాటక రాజకీయాలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. 222 స్దానాలకు జరిగిన ఎన్నికల్లో బల నిరూపణకు మ్యాజిక్ ఫిగర్ 112. అయితే, బిజెపికి అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా బలనిరూపణకు సిద్ధపడింది. ఎలాగంటే ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, జెడిఎస్ ఎంఎల్ఏలను ప్రలోబాలకు గురిచేసి అవసరమైన మద్దతును కూడగట్టవచ్చని బిజెపి అనుకున్నది. అనుకున్నదే తడవుగా ప్రతిపక్ష ఎంఎల్ఏలకు భారీగానే గాలమేసింది.
గాలానికి చిక్కని ఎంఎల్ఏలు
బిజెపి ప్రయత్నాలతో అప్రమత్తమైన కాంగ్రెస్, జెడిఎస్ నేతలు ముందు జాగ్రత్త పడ్డారు. దాంతో బిజెపి గాలానికి ప్రతిపక్షాల నుండి ఏ ఎంఎల్ఏ కూడా చిక్కలేదు. చివరకు గాలానికి చిక్కిన స్వతంత్ర ఎంఎల్ఏ కూడా జారిపోయారు. బలనిరూపణకు అవసరమైన సంఖ్యా బలం తమకు లేదని బిజెపి నేతలకు అర్ధమైపోయింది. దాంతో అసెంబ్లీలో ఉద్వేగంగా దాదాపు గంటపాటు ప్రసంగించిన యడ్యూరప్ప చివరకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.