ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఫుల్ క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. మీకు ఇటీవల అత్యుత్సాహం బాగా ఎక్కువైపోతోంది రాజప్ప గారు... సీనియర్ అయిన మీరు ఇలా వ్యవహరించడం తగదు.. పార్టీలో అందరిని సమానంగా కలుపుకు పోవడంతో పాటు అందరిని సమానంగా చూస్తూ సమన్వయం చేసుకోవాలని చిన్నపాటి క్లాస్ కూడా పీకినట్టు సమాచారం.
ఇక అసలు మ్యాటర్లోకి వెళితే మంత్రి నారా లోకేష్ తాజాగా తూర్పు గోదావరితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించారు. తూర్పు గోదావరి జిల్లాలో నారా లోకేష్ పర్యటన సందర్భంగా పలువురు లోకేష్తో కరచాలనం చేసేందుకు, ఆయన దృష్టిలో పడేందుకు పోటీ పడ్డారు. ఎవరికి వారు లోకేష్ దగ్గరకు వచ్చేందుకు ముందుకు దూసుకు వచ్చారు. లోకేష్ ప్రాపకం కోసం సామాన్య కార్యకర్తల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారు ఆయన కంట్లో పడేందుకు, ఆయన దగ్గర మంచి మార్కులు వేయించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు తాము చేశారు.
ఈ పర్యటన మొత్తం హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పర్యవేక్షించారు. ఆయన ఆధ్వర్యంలోనూ తూర్పు లోకేష్ పర్యటన జరిగింది. లోకేష్ను ఎవరు కలవాలన్నా చినరాజప్ప అనుమతి లేనిదే ముందుకు కదల్లేకపోయారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా వచ్చారు. సహజంగానే ప్రొటోకాల్ ప్రకారం ఆయనకు కూడా లోకేష్ దగ్గర ఎక్కువ ప్రయారిటీనే ఉండాలి. అయితే హోం మంత్రి రాజప్ప అత్యుత్సాహంతో సుబ్రహ్మణ్యంను లోకేష్ దగ్గరకు వెళ్లనీయలేదు. దీంతో ఫైర్ అయిన ఆయన లోకేష్ ప్రోగ్రామ్ నుంచి వెనక్కు వెళ్లిపోయారు.
ఈ విషయాన్ని కొందరు లోకేష్ చెవిలో వేశారు. దీంతో లోకేష్ రెడ్డి సుబ్రహ్మణ్యంకు స్వయంగా ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి కూల్ చేసినట్టు తెలిసింది. లోకేష్ సర్ది చెప్పడంతో వెనక్కి వచ్చిన ఆయన్ను లోకేష్ తన వాహనంలో పక్కన కూర్చో పెట్టుకు మరీ ఆయన్ను బుజ్జగించారు. ఇక హోం మంత్రిగా ఉంటూ ప్రజా ప్రతినిధుల విషయంలో ఇలా వ్యవహరించడం ఏంటని లోకేష్ రాజప్పకు గట్టిగానే క్లాస్ పీకేశారట. దీంతో రాజప్ప అత్యుత్సాహం కాస్తా నీరు గారిందన్న టాక్ వచ్చింది.