కీలకమైన అంశాల్లో సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఆయన తీసుకుం టున్న నిర్ణయాలు.. విమర్శలకు తావిస్తున్నాయి. 2018 నాటికి పోలవరం తొలి దశ పనులు ఎలాగైనా పూర్తిచేయాలని ఆయన ఉక్కుసంకల్పంతో ఉన్న విషయం తెలిసిందే! ఈ కాంట్రాక్టు పనులు దక్కించుకున్న ట్రాన్స్స్ట్రాయ్ కంపెనీపై ఇప్పుడు ఆయన అసంతృప్తితో ఉన్నారట. అయితే ఆ కంపెనీని కాదని ఇతర పనులను వేరే కాంట్రాక్టరును ఆహ్వానించడం, అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించిన అంశాల్లో టీడీపీ అధినేత వ్యవహారశైలిపై ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. ఆయనే స్వయంగా రంగంలోకి దిగి సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పోలవరం పనులు పూర్తి చేయని ట్రాన్స్ స్ట్రాయ్ కంపెనీకి 60 సీ కింద నోటీసులు ఇచ్చామని సీఎం చంద్రబాబు ప్రకటిం చారు. 60సీ కింద నోటీసులు అంటే.. పనులు చేయని కంపెనీ వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఒప్పందం రద్దు చేసుకోవటానికి రెడీ అవ్వటమే. అంటే.. ట్రాన్స్స్ట్రాయ్తో ఒప్పందం రద్దు చేసుకోవాలి. కానీ పోలవరం దగ్గరకు వచ్చేసరికి `సెటిల్ మెంట్ల`కు మార్గం సుగమం చేస్తోంది ప్రభుత్వం. ట్రాన్స్ స్ట్రాయ్ చేయలేని పనులను ఇక్కడ మాత్రం వేరేవారికి అప్పగిస్తామని చెబుతున్నారు. ఇది నిబంధనలకు వ్యతిరేకమంటున్నారు అధికారులు. 60సీ కింద నోటీసు.. తర్వాత తమకు నచ్చిన వారికి పనులు అప్పగించుకోవటం కుదరదని చెబుతున్నారు.
అంటే ట్రాన్స్ స్ట్రాయ్ కు నోటీసులు ఇచ్చింది వేరే వాళ్ల పనులు `సెటిల్` చేయడానికే అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాము చెప్పినట్లు వినకపోతే టెండర్ రద్దు చేస్తాం.. అసలుకే మోసం వస్తుంది కాబట్టి.. చెప్పినట్లు వినాల్సిందేనని మెడపై కత్తి పెట్టడంలాంటిదే అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక అగ్రిగోల్డ్ , కేశవరెడ్డి స్కూల్స్ విషయంలోనూ ఇదే తంతు చంద్రబాబు దీనినే ఫాలో అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ప్రముఖ పారిశ్రామికవేత్త, మీడియా అధినేత సుభాష్ చంద్ర వచ్చి భేటీ కావటం అనంతరం పరిణామాలు అనేక ఆరోపణలకు తావిస్తున్నాయి.
భేటీ తర్వాత,, ఆయన ఆస్తులు తీసుకోవటానికి ఆసక్తిగా ఉన్నారని కోర్టుకు ప్రభుత్వం నివేదించటం కూడా సందే హాలకు తావిస్తోంది. అగ్రిగోల్డ్ కు ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులు ఉన్నాయో బహిరంగంగా ప్రకటించి.. ఆసక్తిగల సంస్థలను ఆహ్వానించి ఉంటే మరింత ఎక్కువ ఆఫర్ వచ్చి ఉండేదనేది అధికారులు అభిప్రాయపడుతున్నారు. తనకు జీ అధినేతతో ఉన్న సంబంధాలతోనే చంద్రబాబు ఈ డీల్ సెటిల్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక పిల్లల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లు వసూలుచేసిన కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యం.. ఐపీ పెట్టినప్పుడు కూడా ఇదే తీరుగా వ్యవహరించచిందనే ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే!!