అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన ధర్నా కార్యక్రమం విజయవంతమైంది. జగన్ ధర్నాకు జనం పోటెత్తారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో జరిగిన సభకు కూడా జనం పోటెత్తారు. ఉరవకొండలో కేవలం ధర్నాకార్యక్రమమే ఉన్నా..జనం బహిరంగ సభను మించి హాజరుకావడం వైసీపీ శ్రేణులను ఆనందంలో ముంచెత్తింది.
ఇదే సమయంలో వైఎస్ జగన్ సభకు వచ్చిన జనసందోహం టీడీపీ నేతల గుండెల్లో గుబులు రేపుతోంది. ఓవైపు అనంతపురం టీడీపీ వర్గ విబేధాలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో జగన్ సభ వారిని మరింత ఆందోళనలోపడేసింది. ఇక ఉరవకొండ సభలో వైఎస్ జగన్ అధికార పక్షంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు కమీషన్ల కోసం ప్రాజెక్టుల రీఎస్టిమేషన్ వేయించి దోచుకుంటున్నాడని జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
చంద్రబాబును ఏకవచనంతో సంబోదిస్తూ... నువ్ ముఖ్యమంత్రివా.. ముఖ్యకంత్రివా అని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లా కరువుకాటకాలకు పుట్టినిలుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం ఉండే జిల్లాగా ఉంటే ఇప్పుడు అనంతపురం జిల్లాకు ఆ గతి పట్టిందని తెలిపారు.
హంద్రినీవా ప్రాజెక్టును ఆనాడు దివంగత మహానేత 4 వేల కోట్లతో 90 శాతం పనులు పూర్తి చేస్తే పది శాతం పనులు పూర్తి చేయడానికి చంద్రబాబుకు మూడేళ్లు కూడా సరిపోలేదా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఎన్నికలొచ్చినప్పుడల్లా ప్రాజెక్టులు గుర్తుకువస్తాయని.. శంకుస్థాపనలు చేస్తుంటాడని తెలిపారు. గతంలో 1996 ఎన్నికలకు ముందు ఉరవకొండలో.. 1999 ఎన్నికల సమయంలో రాప్తాడులో హంద్రీనావా ప్రాజెక్టుకు రెండు సార్లు శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.