కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం దీక్ష ఉదంతం ఏపీ బంద్ కు దారి తీసింది. ముద్రగడ అరెస్టు నేపథ్యంలో ఆందోళన ఉధృతం చేయాలని కాపు ఐక్య సంఘాలు నిర్ణయించుకున్నాయి. ఆందోళన దిశగా కాపు సంఘాలనేతలు విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్ లో కాపు సంఘాల సమన్వయ వేదిక ను
నిర్వహించారు.
ముద్రగడ ఆరోగ్యవిషయంలో, ప్రభుత్వంనుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో కాపుసామాజిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా శనివారం నాడు రాష్ట్రవ్యాప్త బంద్ కు కాపు సంఘాల సమన్వయవేదిక లోని కాపు సంఘాల నేతలు పిలుపు ఇచ్చారు. ఈ మేరకు సంఘం నాయకులు కొప్పుల వెంకటేశ్వరరావు, గోళ్ల సుబ్రహ్మణ్యం, నరహరిశెట్టి నరసింహారావు బంద్ పై మీడియాతో మాట్లాడారు.
అరెస్ట్ తర్వాత కూడా దీక్ష చేస్తున్న తమ నేత ముద్రగడకు ఏమాత్రం ప్రాణహాని జరిగినా ప్రభుత్వమే మూల్యం చెల్లించుకోవాలని కాపునేతలు హెచ్చరిస్తున్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా కాపులందరినీ, హక్కుల పోరాటం కోసం ఓకేఐక్యవేదికపైకి తేవాలని ఐక్యవేదిక తీర్మానించింది.
ఇప్పటికే ముద్రగడ అరెస్టు నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో బంద్ వాతావరణం నెలకొంది. శుక్రవారమే కొన్ని కాపు సంఘాలు బంద్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ మధ్య కాలంలో బందులకు దూరమై ఆంధ్రాలో ఇప్పుడు కాపు ఉద్యమ కారణంగా ఇక తరచూ బంద్ లు, ఆందోళనలు కొన్నాళ్ల పాటు తప్పే అవకాశం లేదంటున్నారు విశ్లేషకులు.