ఒకరు కాదు, ఇద్దరు కాదు.. దాదాపుగా 10 మంది ఎమ్మెల్యే లను టీడీపీ దూరం చేసుకుంది. అంతేకాదు ఎంతో మంది నాయకులను, మాజీ పార్టీ ఎమ్మెల్యేలను పోగొట్టుకుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భారీగా నష్టపోయి కష్టాలను ఎదుర్కొంటున్నది. ఆంధ్రప్రదేశ్ లో అధికారం లో ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ కు వచ్చే సరికి ఎంత దారుణంగా పరాజయం పాలయిందో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటేనే అర్ధమవుతున్నది. మొన్నటి వరకు తాను టీడీపీ లోనే ఉంటాను. టీడీపీని 2019 ఎన్నికలలో ఎలాగైనా సరే గెలిపించి అధికారం కైవసం చేసుకుంటామని చెప్పిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరిపోయారు.
తెలుగుదేశం పార్టీకి తెలంగాణ లో ఎదురుదెబ్బల పరంపరకు... ఆ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి ఎమ్మెల్యే ల వలసకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కనిపించడం లేదు.
టీడీపీ శాసనసభపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు తో పాటు ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇకపోతే తాజాగా మరో నేత మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేట టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. మంత్రులు హరీష్ రావు, లక్ష్మారెడ్డిలతో ఆయన సుదీర్ఘంగా సమావేశమై అనంతరం తాను టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు చెప్పిన మాటలు ఏమిటంటే... నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాలని నిర్ణ యించుకున్నాం. ఎమ్మెల్యేగా గెలిచి 20 నెలలైనా ప్రజల కోసం ఏమీ చేయలేకపోయాం. అందుకే వారికోసం పార్టీమారాలని నిర్ణ యించుకున్నాం. కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామంటూ తెలిపారు. అంటే దాదాపుగా తెలంగాణలో టీడీపీ నాయకులు ప్రజల ముందుకు పోలేని పరిస్థితి ఉందా..? లేక అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పాలసీ ని అవలంభించేందుకు టీడీపీ ప్రజాప్రతినిధులకు కావాలనే ఆ పరిస్థితిని తీసుకు వస్తుందా..?. లేక.. ఇక తెలుగు దేశం పార్టీ తెలంగాణ లో మనుగడ కష్టం.
ఆ పార్టీ ని పట్టుకుని ఉంటే రాజకీయ జీవితం నాశనం కాక తప్పదన్న ఆలోచనలో జంపింగ్ జపాంగ్ అంటున్నారా..? అన్నది ఇప్పుడు టీడీపీ అదిష్టానం ముందున్న అర్ధం కానీ ప్రశ్న. టీటీడీపీ ముందున్న సవాల్ ఏదైన్నప్పటికీ దానికి అడ్డుకట్ట వేయాలంటే ఇప్పట్లో సాధ్యం కానీ పరిస్థితి. ఎలాగంటే తాజాగా ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ వీడి.. టీఆర్ఎస్ లోకి చేరుతున్న సందర్భంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏపీ లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... తెలంగాణ లో పార్టీ ని పూర్తిగా విస్మరించారు. ఆయన ఇక తెలంగాణ ప్రాంతానికి రాడన్న వార్తలు సాధారణ కార్యకర్తలు సైతం నమ్ముతున్నారు. దీంతో పార్టీకి వీడే వారి సంఖ్య పెరిగిపోతుందన్నారు. అంతేకాదు తెలంగాణ ప్రాంతంలో టీడీపీ బ్రతకడం కష్టమేనని తెలిపారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు సైతం తెలంగాణ రాజకీయాలు దాదాపుగా పక్కన పెట్టినట్టు ఆయనే ప్రకటించారు. ఆయన ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండటమో.. లేక రాజకీయ ఎత్తుగడ భాగమో తెలియదు కానీ ఆయన దూరంగానే ఉంటూ వస్తున్నారు.
పార్టీకి సంబంధించి పూర్తి నిర్ణయాలు తెలంగాణ ప్రాంత నాయకులకే వదిలిపెట్టారు. అలాంటిది.. ఒక శాసనసభ ప్లోర్ లీడర్ గా ఉన్న ఎర్రబెల్లి... ఇప్పుడు సడెన్ గా ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోవలసి వచ్చిందో ఆర్ధం కాలేదు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవలసిన సీనియర్ నేతలు... తమకేందుకు అని పక్కకు తప్పుకోవడం ఎంతవరకు సమజసం. ఒక పార్టీ తరపున శాసన సభలో ఫ్లోరర్ లీడర్ గా ఉంటూ అందరికీ మార్గదర్శకంగా ఉండాల్సిన వ్యక్తి పార్టీ మారడంతో తెలుగుదేశం పార్టీ అయోమయంలో పడిపోయింది. ఇకపోతే మొదటి నుంచి చెప్పుకుంటున్నట్లు తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ బలోపేతం కావాలంటే.. ముందు తెలుగుదేశం పార్టీకి భరోసా కావాలి. కార్యకర్తలలో నమ్మకం కలిగించాలి. భరోసా.. నమ్మకం కలిగించాలంటే.. టీడీపీకి ఇప్పుడు చరిష్మా కలిగిన నాయకుడు అవసరం ఉన్నది. పవన్ సపోర్టు టీడీపీ కి ఎలాగో ఉన్నది. పవన్ ను తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉపయోగించుకోవాలి.
ఎలాగైనా పవన్ ను ప్రజల్లోకి తీసుకెళ్ళి... సమస్యలపై పోరాటం చేయించాలి. ఇక... గతంలో ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున విరివిగా ప్రచారం చేసి ఆకట్టుకున్న ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవాలి. కుటుంబ సమస్యలను పక్కన పెట్టి... పంతాలను పక్కన పెట్టి తెలంగాణ లో పార్టీ బలోపేతం కావాలంటే..ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే చంద్రబాబును తెలంగాణ లో నమ్మే పరిస్థితి లేదు. అంతేకాదు ఆయన ప్రవర్తన కూడా అలనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ...పార్టీ లో పోయేవాళ్లు పోని, కార్యకర్తలు ఉన్నంత కాలం పార్టీ ఉంటుందని ప్రసంగాలిస్తే.. పార్టీకార్యకర్తలు కూడా కరువైపోయే పరిస్థితి రావచ్చు. ఇప్పటికిప్పుడు యద్ద ప్రతిపదికన పార్టీ పై దృష్టి పెట్టి కొత్తగా వచ్చే వారిని ఆహ్వానించి కార్యకర్తలకు కొంత వరకైనా బూస్ట్ ఇవ్వక తప్పదు.
మరోవైపు అధికార టీఆర్ఎస్ సైతం టీడీపీని కతం చేసేందుకు కత్తులు నూరుతున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ అధిష్టానం చూస్తూ ఊరుకుంటే ఇక టీడీపీ కి మిగిలేది ఎన్టీఆర్ భవనే తప్ప మరింకోటి ఉండదు. ఇప్పుటికిప్పుడు పార్టీ మంచి చరిష్మా కలిగిన నాయకుడు అవసరమ కాబ్బటి ఆ దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది. ఎందుకులే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నది కాబట్టి సరిపోతుంది. తెలంగాణ సంగతి తరువాత చూసుకుందాం అంటే మాత్రం... తెలుగుదేశం పార్టీ ఖాళీ కాక తప్పదు. మరి చంద్రబాబు ఈ విషయంలో ఎలా ఆలోచిస్తున్నాడో చూడాలి మరి.