అమరావతి : చంద్రబాబుకు జగన్ ప్రభుత్వం భారీ షాక్..వేరే దారిలేదా ?
కరకట్టమీద ఉన్న గెస్ట్ హౌస్ ను సొంతంచేసుకునేందుకు చంద్రబాబు భవనం యజమాని లింగమనేని రమేష్ తో క్విడ్ ప్రో కో కు పాల్పడినట్లు సీఐడీ ఆరోపించింది. అమరావతి ప్రాంతంలో లింగమనేనికి ఉన్న భూములకు లాభం చేయటానికి వీలుగా చంద్రబాబు, నారాయణ మాస్టర్ ప్లాన్ ను తయారుచేశారనే ఆరోపణలు ఎప్పటినుండో ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేర్పులను కూడా లింగమనేనికి ఉద్దేశ్యపూర్వకంగానే లబ్దిచేకూర్చినట్లు సీఐడీ గుర్తించింది.
గెస్ట్ హౌస్ తో పాటు నారాయణ, బంధువుల ఆస్తులను, బ్యాంకుల్లోని డబ్బులను కూడా ప్రభుత్వం ఎటాచ్ చేసింది. బినామీలకు చెందిన 75880 చదరపు అడుగుల ఆస్తులను ఎటాచ్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే చంద్రబాబుతో పాటు మద్దతుదారులు, కొందరు ప్రముఖులు వేలాది ఎకరాలను సొంతం చేసేసుకున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు అధికారంలోకి రాగానే కరకట్టమీద ఉన్న అక్రమ కట్టడాలను అన్నింటినీ కొట్టేయాలని డిసైడ్ అయ్యారు. అప్పట్లో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ ప్రతి నిర్మాణం దగ్గరకు వెళ్ళి నిర్మాణాలను కూల్చేస్తున్నట్లు నోటీసులు కూడా అంటించారు. అయితే తర్వాత తెరవెనుక ఏమైందో ఎవరికీ తెలీదు. లింగమనేని గెస్ట్ హౌస్ ను చంద్రబాబు తీసేసుకున్నారు. ఆ తర్వాత నిర్మాణాన్ని కూల్చేవిషయాన్నే వదిలేశారు. చంద్రబాబు కూడా ఒకసారి గెస్ట్ హౌస్ లింగమనేనిదే అని చెప్పారు. మరోసారి గెస్ట్ హౌస్ ప్రభుత్వానిదే అని చెప్పారు. హఠాత్తుగా ఇపుడు గెస్ట్ హౌస్ ను ప్రభుత్వం ఎటాచ్ చేయటంతో మరోసారి కాంట్రవర్సీ రేగుతోంది. చివరకు గెస్ట్ హౌస్ ను చంద్రబాబు ఖాళీ చేయక తప్పటంలేదు.