అమరావతి : అద్దెకాళ్ళపైన ఆధారపడితే అంతే సంగతులా ?

Vijaya


సొంతకాళ్ళని కాకుండా అద్దె కాళ్ళని నమ్ముకుంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పనికూడా గోవిందానేనా ? కర్నాటక  ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత చాలామందికి ఇలాగే అనిపిస్తోంది. పవన్ కు కర్నాటకలోని జేడీఎస్ కుమారస్వామి పెద్ద  రోల్ మోడల్ అన్న విషయం తెలిసిందే. కుమారస్వామి పెద్ద కష్టపడకుండానే 2018లో ముఖ్యమంత్రి అయిపోయారు. అప్పటినుండి పవన్ ఎక్కడ మాట్లాడినా కుమారస్వామి ముఖ్యమంత్రి అయిన విధానాన్నే ప్రస్తావిస్తుంటారు.



2018లో అంటే కుమారస్వామికి అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టింది కాబట్టి తెచ్చుకున్నది 37 సీట్లే అయినా ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయారు. ఎక్కువ సీట్లు తెచ్చుకున్న మొదటి రెండు పార్టీలను కాదని మూడో పార్టీ అధినేత ముఖ్యమంత్రి అవటం చాలా అరుదు. కర్నాటకలో అప్పట్లో అదృష్టం వరించబట్టే కుమారస్వామి సీఎం అయిపోయారు. ఆ విషయం పవన్ మనసులో బాగా నాటుకుపోయినట్లుంది. అదృష్టం ఉంటే తాను కూడా జేడీఎస్ చీఫ్ లాగే ఏపీలో సీఎం అయిపోవచ్చని కలలు కంటున్నారు.



ఇక్కడ విషయం ఏమిటంటే కుమారస్వామి కర్నాటక మొత్తానికి పార్టీని విస్తరించలేదు. పాత మైసూరు లాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పార్టీని బలోపేతం చేసుకున్నారు. గిరిగీసుకున్నట్లు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జేడీఎస్ గట్టి పోటీ ఇస్తోంది. తాజా ఎన్నికల్లో 139 నియోజకవర్గాల్లో జేడీఎస్ డిపాజిట్ కోల్పోవటానికి కారణమిదే.  అవకాశాలు కలిసొస్తే ఎక్కువ సీట్లు గెలుస్తుంది లేకపోతే సోదిలోకి కూడా కనబడకుండా పోతుంది. ఇపుడు జరిగింది ఇదే.  తాజా ఎన్నికల్లో  కాంగ్రెస్ విజృంభించటంతో బీజేపీనే నిలవలేకపోతే ఇక జేడీఎస్ ఏమి తట్టుకుంటుంది ?



ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే పవన్ కూడా అవకాశం ఉన్నాకూడా పార్టీని రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా బలోపేతం చేయలేదు. ఎంతో బలముందని అనుకుంటున్న ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా పార్టీకి పట్టులేదు. కుమారస్వామి లాగే పవన్ కూడా అచ్చంగా అదృష్టాన్ని మాత్రమే నమ్ముకున్నారు. ప్రతి ఎన్నికకు ఏదో పార్టీతో పొత్తు పెట్టుకోనిదే ఒంటరిగా పోటీచేయలేని పరిస్ధితికి పవన్ దిగజారిపోయారు. పైగా ఒంటరిగాపోటీచేస్తే పార్టీకి వీరమరణమే అని తనకు తానే ప్రకటించేశారు. సొంతకాళ్ళమీద కాకుండా జీవితమంతా అద్దె కాళ్ళమీదే కుమారస్వామి లాగ రాజకీయం చేయాలని అనుకున్న పవన్ ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండలేరు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: