ఉత్తరాంధ్ర : నాగబాబే జనసేనను ముంచేస్తారా ?

Vijaya



వ్యవహారం చూస్తుంటే అదే అనుమానం పెరిగిపోతోంది. ఉత్తరాంధ్ర, విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలిలో పార్టీ ఆఫీసు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడిన మాటల్లో మూడు పాయింట్లు కీలకమైనవి. అవేమిటంటే రాబోయేది జనసేన ప్రభుత్వమే. పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అవుతారు. మూడో పాయింట్ ఏమిటంటే జనసేనకు జనాధరణ విపరీతంగా పెరిగిపోతోంది. 2019లో 7 శాతం వచ్చిన ఓట్లు ఇపుడు అధికారికంగా 35 శాతానికి పెరిగిందట.



7 శాతం ఓట్లు 35 శాతానికి ఎలా పెరిగిందో ? పెరిగినట్లు నాగబాబు దగ్గర ఉన్న ఆధారం ఏమిటో మాత్రం చెప్పలేదు. ఇంటింటికి తిరిగి పార్టీలు సర్వే చేసినపుడు ఏ పార్టీ వెళితే ఆ పార్టీకే ఓట్లేస్తామని చాలామంది చెబుతారు. అంతమాత్రాన వాళ్ళంతా సదరు పార్టీకే ఓట్లేస్తారని గ్యారెంటీలేదు. జనసేన ఇంటింటి సర్వేచేసినట్లు కూడా సమాచారం లేదు. మరి ఓట్ల శాతం 7 నుండి 35 శాతానికి పెరిగిందని నాగబాబు ఎలా చెప్పారో ? నిజంగానే ఓట్లశాతం 35 దగ్గరుంటే ఎన్నికల నాటికి మరింత పెరగటం ఖాయమేమో.



అంటే ఎన్నికలనాటికి సుమారు 40 శాతం ఓట్లుండే జనసేన పొత్తుకోసం చంద్రబాబునాయుడు వెంట ఎందుకు పడుతోంది ? 35-40 శాతం ఓటు బ్యాంకంటే చిన్న విషయం కాదు చాలా పెద్దదనే చెప్పాలి. నాగబాబు మాటలు వింటే జనసేన ఓటుబ్యాంకు టీడీపీ ఓటుబ్యాంకుకు దాదాపు సమానమన్నమాట.



మరంత ఓటుబ్యాంకున్న జనసేన హ్యాపీగా ఒంటరిగానే పోటీచేసి అధికారం దక్కించుకోవచ్చు కదా ? నాగబాబు ఎక్కడికెళ్ళినా జనసేన ప్రభుత్వమే ఏర్పాటవుతుంది, పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అవుతారని పదేపదే చెబుతున్నారు. అలా చెప్పటం వెనుక 35 శాతం ఓటుబ్యాంకే కారణమని అనిపిస్తోంది. ఇలా చెప్పి చెప్పి పవన్ను మాయచేసి జనసేనను ఒంటరిపోటీకి నాగబాబు రెడీచేస్తున్నారా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. అదే జరిగితే గతంలో పవన్ చెప్పినట్లు జనసేనకు రెండోసారి కూడా వీరమరణం తప్పదనే అనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: