అమరావతి : మోడీ అంటే ఇంత భయపడుతున్నారా ?

Vijaya



నరేంద్రమోడీ అంటే చంద్రబాబునాయుడు ఎంత భయపడుతున్నారో తాజాగా మరోసారి బయటపడింది. ఒక ఛానల్ నిర్వహించిన సదస్సులో ముఖ్యఅతిధిగా చంద్రబాబు పాల్గొన్నారు. ఆ సందర్భంగా అనేక అంశాలపై మాట్లాడిన యాంకర్ గతంలో మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవాలని ప్రయత్నించి ఇపుడు అదే మోడీకి మద్దతుగా ఎలా మారారు ? అని ప్రశ్నించారు. ప్రశ్నవిన్న చంద్రబాబుకు ఏమి సమాధానం చెప్పాలో మొదట అర్ధంకాలేదు.



అయితే వెంటనే తేరుకుని తాను మోడీని ఎప్పుడూ వ్యతిరేకించలేదని చెప్పారు. ఆ సమయంలో కూడా మోడీ పాలసీలను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. మోడీ పాలసీలకు  మాత్రం మొదటినుండి మద్దతు ఇస్తునే ఉన్నట్లు చెప్పారు. తామిద్దరం గొప్పవిజన్ ఉన్న నేతలమని తన భుజాన్ని తానే చంద్రబాబు తట్టుకున్నారు. అంతేకాకుండా మోడీగురించి చాలా గొప్పగా మాట్లాడారు. అంటే రాబోయే ఎన్నికలకు సంబంధించి మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుందామని విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.



బీజేపీ మద్దతు ఛానల్ గా పేరున్న ఈ ఛానల్లో మోడీగురించి గొప్పగా మాట్లాడితే ఆ విషయాన్ని ప్రధానికి చేరకపోతుందా అని అనుకున్నట్లున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మోడీ పాలసీల గురించి కాదు వ్యక్తిగతంగా అసెంబ్లీలోనే చంద్రబాబు నోటికొచ్చింది మాట్లాడిన విషయం అందరికీ తెలుసు. మోడీ గురించే కాదు ఆయన భార్య గురించి చివరకు తల్లి గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడారు.



బీజేపీని ఓడిస్తానని చాలెంజ్ చేసి జమ్మూ కాశ్మీర్, బెంగాల్, ఢిల్లీ, కర్నాటక, తమిళనాడు ఎక్కడెక్కడో తిరిగి అందరినీ ఏకంచేద్దామని చాలా ప్రయత్నాలే చేశారు. బెంగాల్లో అయితే మోడీకి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు. అయితే తర్వాత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇదే సమయంలో 2014 ఎన్నికల్లో కన్నా 2019లో మరింత మెజారిటితో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. దాంతో అప్పటినుండి మోడీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే భయపడుతున్నారు. రాబోయే ఎన్నికలనాటికి ఎలాగైనా బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని ప్రయత్నిస్తున్న కారణంగానే మోడీని ఆకాశమంత ఎత్తులో పొగిడేశారు. తాజా ఎపిసోడ్ లో మోడీ అంటే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారో తెలిసిపోయింది. 




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: