రాయలసీమ : సునీతపై పోస్టర్ల కలకలం..ఖాయమేనా ?

Vijaya


వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీత కాస్త ఒక్కసారిగా వైఎస్ సునీత అయిపోయారు. వైఎస్ సునీత పేరుతో ప్రొద్దుటూరు పట్టణంలో భారీ ఎత్తున పోస్టర్లు అంటించటం ఇపుడు సంచలనంగా మారింది. ఆ పోస్టర్లను ఎవరు అంటించారు ? ఎప్పుడు అంటిచారనే విషయం మాత్రం సస్పెన్సుగా మారిపోయింది. సరే విషయం ఏమిటంటే రాజకీయ రంగంలోకి ప్రవేశించబోతున్న వైఎస్ సునీతమ్మగారికి స్వాగతం..సుస్వాగతం అంటు సునీత ఫొటోతో  పొస్టర్ అంటించారు.



పోస్టర్లో సునీతతో పాటు తండ్రి వివేకానందరెడ్డి ఒకవైపు భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఫొటులు కూడా ఉన్నాయి. అలాగే పోస్టర్ పైన చంద్రబాబునాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, బీటెక్ రవి ఫొటోలు కూడా ఉన్నాయి. పోస్టర్ల అంటించటం వెనుక సూత్రదారి ఎవరో కానీ పోస్టర్లయితే కలకలం సృష్టిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిందేమంటే చాలాకాలంగా సునీత టీడీపీలో చేరుతారనే ప్రచారం అందరికీ తెలిసిందే.



రాబోయే ఎన్నికల్లో సునీత టీడీపీ అభ్యర్ధిగా పులివెందుల నుండి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీచేస్తారనే ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది. లేకపోతే కడప ఎంపీగా అయినా అవినాష్ కు వ్యతిరేకంగా పోటీచేస్తారని చెప్పుకుంటున్నారు. భర్త నర్రెడ్డి ఒకటికి రెండుసార్లు చంద్రబాబుతో భేటీ అయ్యారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇపుడు విషయం ఏమిటంటే సునీత కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కరరెడ్డి వెంటపడ్డారు.



వాళ్ళు కోర్టులో ఏ పిటీషన్ వేసినా వెంటనే ఆ విషయం సునీతకు తెలిసిపోతోంది. అందుకనే ఆమె కూడా అవినాష్ పిటీషన్ కు వ్యతిరేకంగా వెంటనే కేసు వేసేస్తున్నారు. మొత్తానికి అవినాష్, భాస్కర్ కు వ్యతిరేకంగా సునీత వెంటపడుతున్నారన్నది మాత్రం వాస్తవం. సునీత ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి, భారతీకి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడటంలేదు.  పోస్టర్లలో చెప్పినట్లుగా టీడీపీలో చేరిన తర్వాత జగన్, భారతీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడుతారేమో చూడాలి. అందుకనే పోస్టర్లు ఇపుడు అంత కలకలం సృష్టిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: