అమరావతి : జగన్ ఇచ్చిన సిగ్నల్ ఇదేనా ?

Vijaya


మంత్రులు, ఎంఎల్ఏలు, కోఆర్డినేటర్లతో జరిగిన సమావేశంలో జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన సిగ్నల్ ఇచ్చారు. ‘ఏ ఎంఎల్ఏని వదులుకోను, ఎంఎల్ఏలందరినీ గెలిపించుకుంటాను’ అనే మాటను జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. అయితే బిట్వీన్ ది లైన్స్ అన్నట్లుగా జగన్ చెప్పని విషయం మరోటుంది. అదేమిటంటే సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తానని. ఈ విషయంలో జగన్ చాలా జాగ్రత్తగా ఆచుతూచి మాట్లాడారు. ఏ ఎంఎల్ఏనీ వదులుకోనన్నారు..ఎంఎల్ఏలందరినీ గెలిపించుకుంటానని మాత్రమే చెప్పారు.



ఇదే సమయంలో అధికారంలోకి రాగానే ఎంఎల్సీ, కార్పొరేషన్ ఛైర్మన్ పదవులిస్తానని కూడా ప్రకటించారు. అంటే దీని అర్ధం ఏమిటంటే టికెట్లు రాదు అని అనుమానం ఉన్నవాళ్ళు, లేదా టికెట్లు దక్కనివాళ్ళు పార్టీని వదిలి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పకనే చెప్పారు. కాదని ఎవరైనా వెళిపోతే ఇక మీ ఖర్మ అన్నట్లుగా వదిలిపెట్టేశారు. టీడీపీ అభ్యర్ధి గెలుపుకు క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు ఎంల్ఏల పరిస్ధితి ఎలా ఉండబోతోందో అందరికీ అర్ధమవుతోంది.



నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డికి కాకుండా ఆయన తమ్ముడు గిరిధరరెడ్డికి టికెట్ ఇస్తానని చంద్రబాబునాయుడు చెప్పారనే ప్రచారం జరుగుతోంది. అలాగే తాడికొండలో శ్రీదేవికి టికెట్ ఇచ్చే ఉద్దేశ్యంలో చంద్రబాబు లేరట. ఇక ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖరరెడ్డికి టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని తమ్ముళ్ళే చంద్రబాబుతో చెప్పారట. చంద్రబాబును నమ్ముకుని పార్టీకి ద్రోహంచేసినా లేదా పార్టీని వదిలేసి వెళ్ళినా భవిష్యత్తు ఉండదని జగన్ పరోక్షంగా హెచ్చరించినట్లే ఉంది.



అలాగే రాబోయే ఎన్నికల్లో కొందరికి టికెట్లు దక్కవన్న విషయం మరోసారి జగన్ స్పష్టంగా చెప్పేసినట్లే. టికెట్లు ఇవ్వకపోయినా పార్టీ గెలుపుకు పనిచేసిన వాళ్ళకు తప్పకుండా ఏదో పదవి ఇస్తానని భరోసా ఇచ్చారు. తాజా మీటింగులో జగన్ చెప్పదలచుకున్నది చెప్పేశారు. ఇక ఏమిచేయాలో ఆలోచించుకోవాల్సింది మంత్రులు, ఎంఎల్ఏలు మాత్రమే. టికెట్ దక్కనివాళ్ళు పార్టీ గెలుపుకు పనిచేసి తమ చిత్తశుద్దిని నిరూపించుకుంటారా లేకపోతే జగన్ను వద్దని బయటకు వెళ్ళిపోతారా అన్నది తేలాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: